Begin typing your search above and press return to search.

బ్రిటన్ కొత్త వైరస్ తో నష్టం జరిగేది ఎవరికంటే?

By:  Tupaki Desk   |   22 Dec 2020 2:30 PM GMT
బ్రిటన్ కొత్త వైరస్ తో నష్టం జరిగేది ఎవరికంటే?
X
కోవిడ్ భయం తగ్గిపోయిన వేళ.. కొత్తగా బయటకు వచ్చిన బ్రిటన్ వైరస్ రకం.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. రెగ్యులర్ కోవిడ్ తో పోలిస్తే దీని వేగం 70 శాతం ఎక్కువగా ఉండటం ఒక ఆందోళన అయితే.. ఇది ఎవరి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుందన్నది ప్రశ్న. దక్షిణ లండన్ లో బయటపడ్డ కొత్త రకం వైరస్ ప్రపంచం మొత్తానికి ప్రమాదమేనని సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులిర్ బయాలజీ) డైరెక్టర్ రాకేశ్ మిశ్రా హెచ్చరిస్తున్నారు.

అమెరికా తర్వాత అత్యధిక కేసులు ఉన్న భారత్ లోనూ ఈ కొత్త వైరస్ కారణంగా కేసులు మరింత పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కొత్త వైరస్ కారణంగా భారత్ లోనూ మరిన్ని కేసులు పెరగటం ఖాయమంటున్నారు. గుండె జబ్బులు ఉన్న వారితో పాటు మధుమేహం వంటి సమస్యలున్న వారిపై దీని ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ కొత్త రకం వైరస్ ఎవరి మీద ఎంత ప్రభావం చూపుతుందన్న విషయంలో.. ఇప్పటికే కరోనా వచ్చిన వారు మరోసారి దాని బారిన పడే వీలుందనన మాట దడ పుట్టించేదిగా మారింది.

సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా అంచనా ప్రకారం.. కొత్త వైరస్ వల్ల ఒకసారి దాని బారిన పడిన వారు.. మళ్లీ పడే అనుమానం తనకు ఉందన్నారు. ఒకవేళ తన అంచనా నిజమైతే.. సమస్య చాలా తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు. మరి.. ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన టీకాలు.. పరిశోధనల చివర్లో ఉన్న కోవిషీల్డ్.. కోవాగ్జిన్ టీకాల మాటేమిటి? అంటే.. ఇవి వైరస్ మీద పని చేస్తాయని.. ఈ టీకాలు ఒకేసారి వైరస్ లోని పలు భాగాల మీద ఏక కాలంలో దాడి చేస్తాయని.. అందువల్ల ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదన్న మాట వినిపిస్తోంది.