Begin typing your search above and press return to search.

వైఎస్ వివేకా హత్య కేసులో ఛార్జిషీటు దాఖలు చేసిన సీబీఐ

By:  Tupaki Desk   |   27 Oct 2021 4:58 AM GMT
వైఎస్ వివేకా హత్య కేసులో ఛార్జిషీటు దాఖలు చేసిన సీబీఐ
X
సీఎం జగన్ బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. సుధీర్ఘ విచారణ అనంతరం పులివెందుల కోర్టులో ప్రిలిమినరీ ఛార్జీషీట్ దాఖలు చేసిన సీబీఐ.. నలుగురు నిందితుల ప్రమేయంపై అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీన్ని మరోసారి ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. వివేకా హత్య కేసులో అరెస్ట్ అయిన సునీల్ యాదవ్ 90 రోజుల రిమాండ్ గడువు ముగుస్తున్నందున సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది.

కడప జిల్లా పులివెందులకు చెందిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు ఏడాదిపాటు దర్యాప్తు చేసి ఇప్పటివరకూ ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. పులివెందులకు చెందిన సునీల్ యాదవ్ ను ఈ ఏడాది ఆగస్టు 4న అరెస్ట్ చేసి పులివెందుల కోర్టులో హాజరుపరిచారు.

ఇక సెప్టెంబర్ 9న సింహాద్రిపురం మండలం సుంకేశుల గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త ఉమాశంకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. వీరిద్దరూ ప్రస్తుతం కడప జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.

ఈ కేసులో మొత్తం నలుగురి ప్రమేయం ఉందని సీబీఐ ప్రాథమిక విచారణలో తేల్చింది. వారిలో ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, డ్రైవర్ దస్తగిరి పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి అరెస్ట్ సందర్భంగా కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో అవే విషయాలు పొందుపరిచారు.

అయితే ఛార్జిషీట్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి? హత్యకేసులో ఎవరి పాత్ర ఉందనే విసయాలు మాత్రం బయటకు వెల్లడికాలేదు. మరికొద్దిరోజుల్లోనే సీబీఐ అధికారులు పూర్తిస్థాయి ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయి ఛార్జిషీట్ లో అసలు హంతకులు, పాత్రధారులు, సూత్రధారుల ప్రమేయాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది.