Begin typing your search above and press return to search.

ఓటుకు నోటు: ఛార్జిషీట్ లో చంద్రబాబు పేరు

By:  Tupaki Desk   |   18 Aug 2015 4:27 AM GMT
ఓటుకు నోటు: ఛార్జిషీట్ లో చంద్రబాబు పేరు
X
ఓటుకు నోటు వ్యవహారంలో ఏసీబీ అధికారులు ఛార్జీషీట్ దాఖలు చేయటం తెలిసిందే. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఛార్జీషీట్ లో ఏపీ ముఖ్యమంత్రి పేరును మ్యాగ్జిమం వాడేసిన అధికారులు.. మొత్తం ఛార్జిషీట్ లో బాబు పేరు 22 సార్లు వాడటం గమనార్హం. అవకాశం వచ్చిన ఏ చోట కూడా వదిలిపెట్టకుండా చంద్రబాబు పేరును ప్రస్తావించే విషయంలో ‘‘ప్రత్యేక’’ జాగ్రత్తలు తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.

ఓటుకు నోటు ఉదంతంలో కర్త.. కర్మ.. క్రియ మొత్తం చంద్రబాబే అన్నట్లుగా ఛార్జిషీట్ ను ఏసీబీ అధికారులు సిద్ధం చేసినట్లుగా విమర్శలున్నాయి. ఛార్జిషీట్ రూపొందించే సమయంలో అధికారుల విచారణ.. దర్యాప్తులో వెల్లడైన అంశాలు.. సేకరించిన ఆధారాలు.. సాక్ష్యాలు.. నిందితుల వాంగ్మూలాలు.. సాక్ష్యుల మాటల.. సాంకేతికంగా అందుబాటులోకి వచ్చిన నివేదికలోని అంశాల్ని క్రోడికరించి.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేరును ప్రస్తావించినట్లుగా కనిపించింది.

ఏసీబీ తాజా లక్ష్యం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుగా కనిపిస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆయనపై నేరుగా ఆరోపణలు (బలమైన సాక్ష్యాలు.. ఆధారాలు లేకుండా) చేయటం సాధ్యం కాని నేపథ్యంలో.. తమకు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ వ్యవహారంలో పాత్ర ఉందన్నట్లుగా ఛార్జిషీట్ లో పేర్కొనటం గమనార్హం.

ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఏపీ ముఖ్యమంత్రిని చేర్చనప్పటికీ.. ఆయన పేరును 22 సార్లు ఉదహరించటం చూసినప్పుడు.. ఆయన్ను బుక్ చేయటమే అంతిమ లక్ష్యంగా అన్నట్లుగా కనిపిస్తోందన్న అభిప్రాయం పోలీసుల అధికారులు లోగుట్టుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఛార్జిషీట్ లో పేర్కొన్న అంశాల్ని పరిశీలిస్తే.. అవసరానికి తగ్గట్లుగా.. ఏపీ ముఖ్యమంత్రిని ఫిక్స్ చేసేందుకు వీలుగా చార్జిషీట్ రూపొందించారన్న వాదన వినిపిస్తోంది. ఒకవేళ అదే నిజం కాని పక్షంలో ఆధారాలు లేకున్నా.. ఛార్జీషీట్ లో 22 సార్లు పేరు ప్రస్తావించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు హస్తం ఉందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసినట్లుగా ఛార్జ్ షీట్ ఉందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.