Begin typing your search above and press return to search.

బత్తాయి తోటకు వెళ్లిన బండిపై కేసు నమోదు?

By:  Tupaki Desk   |   13 May 2020 6:45 AM GMT
బత్తాయి తోటకు వెళ్లిన బండిపై కేసు నమోదు?
X
తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్ కమ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పైన తాజాగా తెలంగాణ పోలీసులు కేసు బుక్ చేశారు. ఆయనేం తప్పు చేశారు? అన్న సందేహం కలుగకమానదు. అయితే.. అందుకు నల్గొండ జిల్లా పోలీసులు చెబుతున్న కారణం వింటే అవాక్కు అవ్వాల్సిందే. లాక్ డౌన్ వేళ.. ఇబ్బందులు పడుతున్న వర్గాల వెతలు తెలుసుకోవటం విపక్షాలకు అలవాటే.

అందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. నల్గొండ జిల్లా పెద్దవూరలోని బత్తాయి తోటల్ని పరిశీలించేందుకు.. అక్కడి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకునేందుకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారన్న కారణంతోనే బండి సంజయ్ పైన కేసు నమోదైంది.
ఈ విషయాన్ని నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ వెల్లడించారు. లాక్ డౌన్ నిబందనల ఉల్లంఘనతో పాటు.. భౌతిక దూరాన్ని పాటించకపోవటమే బండి చేసిన తప్పుగా చెబుతున్నారు. బత్తాయి తోటకు వెళితేనే.. కేసు బుక్ చేసేటట్లైయితే.. తెలంగాణ అధికారపక్ష నేతలు చేసే కార్యక్రమాల్లో భౌతిక దూరాన్ని అస్సలు పాటించని ఉదంతాల మీద కేసులు ఎందుకు నమోదు చేయనట్లు? అని కమలనాథులు క్వశ్చన్ చేస్తున్నారు. గడిచిన ఎనిమిది వారాలుగా టీఆర్ఎస్ నేతలు.. చేపట్టే కార్యక్రమాల్లో భౌతికదూరం పాటించని ఉదంతాలెన్నో కనిపిస్తాయని.. వాటిని వదిలేసి.. తమ పార్టీ అధ్యక్షుడి మీద కేసు నమోదు చేయటాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఇదిలా ఉంటే.. తన తాజా కార్యక్రమంలో భౌతిక దూరం పాటించేలా బండి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.