Begin typing your search above and press return to search.

పోలీసులకు థమ్కీ ఇచ్చిన సాయి ప్రియపై కేసు నమోదు

By:  Tupaki Desk   |   29 Aug 2022 4:14 AM GMT
పోలీసులకు థమ్కీ ఇచ్చిన సాయి ప్రియపై కేసు నమోదు
X
ప్రేమించుకుంటే ప్రేమించుకున్నారు. కానీ.. జనాల్ని.. అధికారుల్ని పిచ్చోళ్లను చేయటం ఏ మాత్రం సరికాదు. ఇదే పని చేసిన విశాఖకు చెందిన సాయిప్రియపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. సంచలనంగా మారిన ఈ ఉదంతం అప్పట్లో పోలీసులను పరుగులు తీయించటమే కాదు.. చెమటలు పట్టించింది కూడా. సాయిప్రియ.. శ్రీనివాసరావులు భార్యభర్తలు. వీరు విశాఖ ఎన్ ఏడీ దగ్గర్లో ఉండేవారు. భర్త హైదరాబాద్ లో జాబ్ చేస్తుంటారు.

జులై 22న వారి పెళ్లి రోజు కావటంతో ఆ రోజున భార్యను తీసుకొని భార్యభర్తలు ఆర్కే బీచ్ కు వెళ్లారు. రాత్రి ఏడున్నర గంటల వేళలో ఇంటికి తిరిగి వెళ్లే వేళలో శ్రీనివాసరావుకు ఫోన్ వచ్చింది. దీంతో.. అతను పక్కకు వెళ్లి ఫోన్ మాట్లాడి వచ్చారు.

ఆయన తిరిగి వచ్చేసరికి సాయిప్రియ కనిపించలేదు. దీంతో.. సముద్రంలోకి కొట్టుకెళ్లిందన్న అనుమానంతో ఆ సమాచారాన్ని అక్కడున్న పోలీసులకు అందజేశారు. దీంతో.. సాయి ప్రియ కోసం స్పీడ్ బోట్లు.. నేవీ హెలికాఫ్టర్ ద్వారా గాలింపులు చేపట్టారు.

ఈ ఆపరేషన్ కోసం భారీ ఎత్తున ప్రయత్నాలు చేశారు. రూ.కోటికి పైనే ఖర్చు చేశారు. ఇంత చేసిన తర్వాత కూడా ఆమె జాడ దొరకలేదు. సాధారణంగా సముద్రంలోకి కొట్టుకు పోయిన వారు ఎవరైనా సరే.. రోజు వ్యవధిలో తిరిగి వస్తారు. కానీ.. సాయి ప్రియ ఆచూకీ మాత్రం లభించకపోవటంతో.. ఆమె ఏమైపోయిందన్న ఆందోళన వ్యక్తమైంది.

అందరి అంచనాలకు భిన్నంగా సాయిప్రియ తన ప్రియుడితో కలిసి బెంగళూరుకు వెళ్లిపోయిన విషయం కాస్త ఆలస్యంగా బయటకు రావటం.. తాను తన ప్రియుడు (పెళ్లికి ముందే ప్రేమించిన వ్యక్తి)తో వెళ్లిన విషయాన్ని ఆమె పోలీసులకు సమాచారం అందించారు. దీంతో.. అందరూ అవాక్కు అయిన పరిస్థితి.

ఆ తర్వాత పోలీసుల ఆదేశాలతో విశాఖకు వచ్చిన వారు.. పోలీసులకు వాంగ్మూలాన్ని ఇచ్చారు. ఈ ఉదంతానికి సంబంధించి తాజాగా.. వారిద్దరపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రియుడితో వెళ్లిపోయి ప్రభుత్వాన్ని.. ప్రజల్ని తప్పుదోవ పట్టించటం.. ప్రజాధనాన్ని.. విలువైన సమయాన్ని వేస్టు చేసినందుకు కోర్టు అనుమతి తీసుకున్న పోలీసులు సాయిప్రియ.. ఆమె ప్రియుడి మీదా కేసు నమోదు చేశారు.