Begin typing your search above and press return to search.

జాతీయజెండాతో మోడీ చేతులు తుడుచుకున్నారట

By:  Tupaki Desk   |   29 Jun 2016 9:16 AM GMT
జాతీయజెండాతో మోడీ చేతులు తుడుచుకున్నారట
X
నరేంద్ర మోడీ.. అనగానే జాతీయ భావానికి నిలువెత్తు చిహ్నమని చెబుతారు. ప్రధాని పదవిని చేపట్టకముందు నుంచి ఆయనలో జాతీయ భావనలు ఎక్కువే. దేశభక్తి విషయంలో మోడీకి సాటి రాగల నేతలెవరూ ప్రస్తుతం లేరని బీజేపీ వర్గాలు చెబుతుంటాయి. అలాంటి మోడీ.. భారత జాతీయ జెండాను అవమానించారంటే నమ్మగలమా? కానీ.. ఆయన జాతీయ జెండాను దారుణంగా అవమానించారంటూ కోర్టులో కేసు నమోదైంది. బీహార్ కు చెందిన ఓ వ్యక్తి ముజఫర్ నగర్ లో ప్రధాని మోడీపై ఈ మేరకు కేసు పెట్టారు.

ఇటీవల అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అగౌరవపరిచారన్నది ఆయనపై ప్రధాన అభియోగం. జాతీయ పతాకాన్నిమామూలు గుడ్డ ముక్కగా పరిగణించిన ప్రధాని దానిని కింద పరుచుకున్నారని.. దానిపై కూర్చున్నారని.. అక్కడితో ఆగకుండా దానితో చేతులు కూడా తుడుచుకున్నారని పిటిషనర్ ఆరోపించారు. మోడీ చేసినట్లుగా చెబుతున్న ఆ పనులకు సంబందించిన ఫొటోలను ఇంటర్నెట్ నుంచి సేకరించిన బీహార్ కు చెందిన ప్రకాశ్ కుమార్ ముజఫర్ నగర్ లోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు ప్రధానిపై కేసు నమోదు చేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది మీడియాకు వివరించడంతో దేశమంతటికీ ఈ విషయం తెలిసింది. కోర్టు ఈ పిటిషన్ పై తదుపరి విచారణను వచ్చే నెల 16కు వాయిదా వేసింది. మోదీ చర్యలు జాతీయ పతాకాన్ని అవమానపరిచేవిగానే ఉన్నాయని ప్రకాశ్ కుమార్ తన పిటిషన్లో ఆరోపించారు. అయితే.. ఈ ఫొటోలు సోషల్ మీడియా నుంచి తీసుకున్నవి కావడంతో ఇవి ఎంతవరకు నిజమైనవన్నది తేలాల్సి ఉంది. సోషల్ మీడియాలో మార్ఫింగ్ చిత్రాలు కావొచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది.