Begin typing your search above and press return to search.

పీకే ఐప్యాక్ టీమ్‌పై కేసు .. స్టేషన్ కి రావాలంటూ సమన్లు !

By:  Tupaki Desk   |   28 July 2021 12:30 PM GMT
పీకే ఐప్యాక్ టీమ్‌పై కేసు .. స్టేషన్ కి రావాలంటూ సమన్లు !
X
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐప్యాక్ సంస్థ కు చెందిన 23 మంది సభ్యులపై త్రిపుర పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేస్తూ, నిన్న అర్ధరాత్రి వీరందరికీ వేర్వేరుగా సమన్లు జారీ చేశారు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టం లోని 51 బీ సెక్షన్ కింద కేసు పెడుతున్నామని, ఆగస్టు 1 న పోలీసు స్టేషన్ కు హాజరు కావాలని ఈ సమన్లలో పొందుపరిచారు పొందుపరిచారు. త్రిపుర లో టీఎంసీ బలోపేతానికి గల అవకాశాలపై స్టడీ చేసేందుకు ఈ సభ్యులంతా ఈ నెల 25 న ఈ రాష్ట్రానికి చేరుకున్నారు. అయితే వీరు బస చేసిన హోటల్ నుంచి బయటకు వచ్చేందుకు అనుమతించకుండా పోలీసులు ఆ రోజు నుంచే నిర్బంధంలో ఉంచారు.

తాము ఏదో రీసెర్చ్ ఆధారిత వర్క్ కోసం ఈ రాష్ట్రానికి వచ్చినట్టు ఈ బృందం తెలిపిందని, ఆ వర్క్ ఏమిటో తాము ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని, పైగా వీరి కరోనా వైరస్ టెస్టు ఫలితాలకోసం కూడా వేచి ఉన్నామని త్రిపుర ఎస్పీ మాణిక్ దాస్ తెలిపారు. ఈ ఫలితాలు రేపు అందవలసి ఉందన్నారు. విచారణ అనంతరం వీరి విడుదలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇదిలా ఉంటే .. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్, దేశంలోనే బలమైన మోదీ-షా ద్వయాన్ని ఢీకొట్టి మమతా బెనర్జీ మూడోసారి సీఎం కావడంలో కీలక భూమిక పోషించిన సంగతి తెలిసిందే. బెంగాల్ ఎన్నికల తర్వాత షెఫాలజిస్ట్ వృత్తి నుంచి తప్పుకుంటానని పీకే ప్రకటించినప్పటికీ, ఆయన నెలకొల్పిన ఐప్యాక్ మాత్రం పాత కమిట్మెంట్లను నిర్వర్తిస్తున్నది.

పంజాబ్ లో కాంగ్రెస్ తరఫున పీకే స్వయంగా రంగంలోకి దిగగా, 2023లో త్రిపురలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయన బృందం అగర్తలలో సర్వే చేపట్టింది. ఈ క్రమంలో 2023లో జరగబోయే త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ తరఫున పనిచేస్తోన్న ఐప్యాక్ బృందం.. ఆ రాష్ట్రంలో మమతా బెనర్జీ ప్రభావాన్ని అంచనా వేసేందుకు, అవసరమైన గ్రౌండ్ వర్క్ సేకరించేందుకు తాజాగా సర్వే చేపట్టింది. అందులో భాగంగా 23 మంది సభ్యులు అగర్తలలోని ఓ హోటల్ లో మకాం వేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు భారీగా హోటల్ కు చేరుకుని, పీకే టీమ్ సభ్యులను గదుల్లోనే నిర్బంధించారు. అగర్తలతోపాటు త్రిపుర అంతటా కొవిడ్ ఆంక్షలు కొనసాగుతున్నాయిని, కొత్త వ్యక్తుల కదలికపై నిఘా ఉందని, ఐప్యాక్ టీమ్ సభ్యులకు కొవిడ్ టెస్టులు చేశామని, రిపోర్టులు రాగానే వారిని విడిచిపెడతామని త్రిపుర పోలీసులు చెప్పారు.

కాగా, త్రిపుర పోలీసులు చెబుతున్నట్లు తాము కొవిడ్ రూల్స్ అతిక్రమించలేదని, సభ్యులంతా ఇప్పటికే టీకాలు తీసుకున్నామని ఐప్యాక్ ప్రతినిధులు వాదిస్తున్నారు. అయితే ప్రశాంత్ కిషోర్ టీమ్ సభ్యుల నిర్బంధాన్ని మాజీ సీఎం, ప్రతిపక్ష నేత మాణిక్ సర్కార్ ఖండించారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని ఆయన ఆరోపించారు. ఈ రాష్ట్రంలో బీజేపీ తన బేస్ ను కోల్పోతోందని, అందువల్లే బిప్లబ్ దేబ్ ప్రభుత్వం సమాచార మూలాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. బీజేపీ అపసవ్య పాలనకు ఇదొక ఉదాహరణ అని త్రిపుర టీఎంసీ చీఫ్ ఆశిష్ లాల్ సింఘాల్ మండిపడ్డారు.