Begin typing your search above and press return to search.

ఐపీఎస్ లకు బండి వార్నింగ్.. గాయపడిన వారికి పరామర్శ

By:  Tupaki Desk   |   28 Jan 2022 5:27 AM GMT
ఐపీఎస్ లకు బండి వార్నింగ్.. గాయపడిన వారికి పరామర్శ
X
అనూహ్యంగా చోటు చేసుకున్న బీజేపీ ఎంపీ అర్వింద్ కాన్వాయ్ మీద దాడి.. బీజేపీ కార్యకర్తలను ఉరికించి ఉరికించి దాడి చేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.

ఇప్పటికే రాజకీయంగా టీఆర్ఎస్ - బీజేపీ మధ్య దూరం పెరిగిందన్న మాట వినిపిస్తున్న వేళలో.. ఆర్మూర్ ఎపిసోడ్ మరింత సంచలనంగా మారింది. ఒక ఎంపీమీద ఇలా దాడి చేయటమా? అన్న విస్మయం వ్యక్తమవుతోంది. ఇక.. ఎంపీ కాన్వాయ్ లో ఉన్న వారిపై జరిగిన దాడిని బీజేపీ వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.

తెలంగాణలోని కేసీఆర్ సర్కారు నిజాం ఆరాచక పాలనను సైతం మించిపోయినట్లుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడుతున్నారు. కేసీఆర్ సర్కారు మరో ఏడాది మాత్రమే ఉంటుందని.. ఆ తర్వాత వచ్చేది బీజేపీ సర్కారేనని.. ఉన్నతాధికారులు ఒళ్లు దగ్గర పెట్టుకొని పని చేయాలని వార్నింగ్ ఇచ్చారు.

ఆర్మూర్ దాడి ఘటనలో గాయపడిన వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించిన బండి సంజయ్.. టీఆర్ఎస్ తీరును తీవ్రంగా తప్పు పట్టారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతున్న కొందరు ఐపీఎస్ అధికారులు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని.. దాడులకు ప్రోత్సహిస్తున్నారని వ్యాఖ్యానించారు.

శాంతిభద్రతల్ని కాపాడాల్సిన సీపీ.. ఎంపీని వెనక్కు వెళ్లాలని చెప్పటం ఏమిటి? అని ప్రశ్నించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవరగ్ంలో తిరిగే వీలు లేని విధంగా నిజామాబాద్ సీపీ వ్యవహరించారని మండిపడ్డారు.

దాడికి పాల్పడిన వారు బహిరంగంగా తిరుగుతున్నా.. ఇప్పటివరకు హత్యాయత్నం కేసు నమోదు చేయలేదని.. ఇది చాలు సీపీ తీరు ఏ రీతిలో ఉందన్న విషయం అర్థమవుతుందని చెబుతున్నారు. ఎంపీపై దాడి జరిగితే సీఎం ఎలానూ మాట్లాడరని.. డీజీపీ సైతం మాట్లాడకపోవటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. టీఆర్ఎస్ మూకలు దాడి చేసి.. దానిని రైతులు దాడి చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారన్నారు. పంజాబ్ లో మాదిరి రైతుల పేరుతో ప్రధానిపై దాడికి యత్నించిన ఖలిస్తాన్ తీవ్రవాదులతో టీఆర్ఎస్ కు సంబంధాలు ఉన్నాయేమో కేసీఆర్ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

ఈ ఉదంతం తెలంగాణలో బీజేపీ - టీఆర్ఎస్ ల మధ్య మరింత దూరాన్ని పెంచిందన్న మాట బలంగా వినిపిస్తోంది. మరోవైపు ఈ ఉదంతంపై కేంద్రం సీరియస్ గా ఉందన్న సంకేతాలు ఇప్పటికే వచ్చాయి. ఆర్వింద్ పై జరిగిన దాడి గురించి రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. రాష్ట్రవ్యవహరాల్ని చూసే ఇన్ చార్జి నేత తరుణ్ చుంగ్ ఫోన్ చేసి అర్వింద్ తో మాట్లాడారు.