Begin typing your search above and press return to search.

బరువు తగ్గితే.. కరోనా బారిన పడే ఛాన్సులు తక్కువా?

By:  Tupaki Desk   |   17 April 2021 12:30 PM GMT
బరువు తగ్గితే.. కరోనా బారిన పడే ఛాన్సులు తక్కువా?
X
మళ్లీ కరోనా మహ్మమారి ముసురుకొంటోంది. అంతకంతకూ పెరుగుతున్నకేసుల నేపథ్యంలో కొత్త వాదనలెన్నో తెర మీదకు వస్తున్నాయి. అంతిమంగా వీటి లక్ష్యం ఒక్కటే.. వీలైనంత వరకు కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవటమే. ముఖానికి మాస్కులు పెట్టుకోవటం.. చేతికి శానిటైజర్ వినియోగించటం.. వీలైనంత వరకు భౌతిక దూరాన్ని పాటించటం లాంటి జాగ్రత్తలు తీసుకుంటే కరోనా రాదనుకుంటే తప్పులో కాలేసినట్లే. వీటన్నింటితో పాటు.. మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మాత్రమే కరోనా ముప్పు తగ్గే వీలుంది.

తాజాగా కరోనా బారి నుంచి తప్పించుకోవటానికి ఉన్న మార్గాలపై పెద్ద ఎత్తున అధ్యయనాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా కొత్త విషయాలు తెర మీదకు వస్తున్నాయి. ఇందులో ముఖ్యమైనది.. బరువు తగ్గటం. శరీర బరువు తగ్గటానికి.. కరోనాకు లింకేమిటన్న సందేహం రావొచ్చు. కానీ.. శాస్త్రీయ అంశాలు చూస్తే.. బరువు తగ్గటంతో కరోనా ముప్పు నుంచి తప్పించుకునే అవకాశం ఉందన్న విషయం అర్థమవుతుంది.

వయసుతో పాటు బి కణాల సామర్థ్యం క్షీణిస్తుంది. టీకాలకు యాంటీబాడీలు ఉత్పత్తి కావటం తగ్గుతుంది. ఊబకాయుల్లో ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది. యాంటీబాడీల ప్రతిస్పందనను కొవ్వు కణజాలం తగ్గిస్తుండటమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో బరువును అదుపులో ఉంచుకోవటం కూడా ఎంతైనా మంచిదని చెబుతున్నారు. ఆహారం ద్వారా లభించే కేలరీలు తగ్గించుకున్నా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

సన్నగా.. ఫిట్ గా.. శారీరకంగా మానసికంగా మరింత ఆరోగ్యంగా ఉండటమే కాదు.. వీరిలో రోగ నిరోధక ప్రతిస్పందన ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. కేలరీలు తగ్గించుకోవటానికి రకరకాల పద్దతులు ఉన్నాయి. అందులోఒకటి పదహారు గంటల ఏమీ తినకుండా ఉండి.. మిగిలిన 8 గంటల సమయంలో టిఫిన్.. భోజనం లాంటివి చేయటం ఈ కోవలోకే వస్తుంది. బరువు తగ్గటం.. ఆహారాన్ని తక్కువగా తీసుకోవటం కూడా కరోనా ముప్పును తగ్గించుకునే అవకాశం ఉంది.

ఆరోగ్యంగా ఉండటం ద్వారా ఆయుష్షుతోపాటు రోగనిరోధకశక్తిని పెంచుతుంది. పెరుగు.. మజ్జిగ.. లాంటి పులిసిన పదార్థాలు పేగుల్లో మంచి బ్యాక్టిరియాను పెంచేందుకు దోహదపడతాయి.అదే సమయంలో పండ్లు.. కూరగాయలు.. పీచు పదార్థాలు పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెరిగేందుకు దోహనం చేస్తుంది. అంతేకాదు.. కరివేపాకు.. బొప్పాయి.. పాలకూర.. బత్తాయి.. పుల్లటి పండ్లు.. అల్లం.. వెల్లుల్లి.. మిరియాలు..పసుపు లాంటి మసాలా దినుసులు కూడా రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయటానికి తోడ్పడతాయన్నది మర్చిపోకూడదు.