Begin typing your search above and press return to search.

27న మంత్రులకు జగన్ డిన్నర్....ఆ వెంటనే రాజీనామాలు...?

By:  Tupaki Desk   |   25 March 2022 11:30 PM GMT
27న మంత్రులకు జగన్ డిన్నర్....ఆ వెంటనే రాజీనామాలు...?
X
మొత్తానికి ఏపీలో మరో కీలక రాజకీయ పరిణామానికి తెర లేవనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రులకు ఈ నెల 27న విందు ఇస్తున్నారు. అందమైన ఆదివారం, ఆహ్లాదకరమైన సాయంత్రం జగన్ వారిని తన నివాసానికి పిలిచి మరీ డిన్నర్ ఇవ్వనున్నారని ప్రచారం సాగుతోంది. అదే రోజు వారి నుంచి మూకుమ్మడి రాజీనామాలను తీసుకుంటారని తెలుస్తోంది. అమరావతి రాజధానిలో ఇపుడు ఇదే హాట్ టాపిక్.

బడ్జెట్ సమావేశాలు ఈ నెల 7న మొదలై 25తో ముగిసాయి. మొత్తం పన్నెండు రోజుల పాటు సుదీర్ఘంగా సాగాయనే చెప్పాలి. జగన్ సీఎం అయ్యాక బడ్జెట్ సమావేశాలు ఇన్ని రోజులు జరగడం ఇదే ప్రధమం. బడ్జెట్ సెషన్ ఈసారి అధికార పార్టీకి కొత్త ఊపు తెచ్చింది. మూడేళ్ళుగా తాము ఏం చేస్తున్నామో ఆయా శాఖల మంత్రులు సభలో వివరించారు. ముఖ్యమంత్రి కూడా తన వంతుగా మాట్లాడారు.

బడ్జెట్ సెషన్ ఇలా ముగియడంతోనే ఎవరి ఊళ్ళకు వారు మంత్రులు వెళ్లాలి. కానీ అధికార వర్గాల నుంచి మంత్రులు అంతా అందుబాటులో ఉండాలంటూ వర్తమానం వచ్చినట్లుగా చెబుతున్నారు. విషయం ఏంటి అంటే ఈ నెల 27న జగన్ మంత్రులకు డిన్నర్ ఇస్తారని. అలా సండే ఈవెనింగ్ జగన్ మంత్రులతో మనసు విప్పి మాట్లాడుతారు అని తెలుస్తోంది.

తనకు గత ముప్పయి నాలుగు నెలలుగా మంత్రులుగా సహకరించిన వారందరికీ పేరుపేరుగా జగన్ ధన్యవాదాలు చెబుతూ వారికి భవిష్యత్తులో పార్టీ బాధ్యతలు అప్పగించే విషయాన్ని కూడా వివరిస్తారు అని అంటున్నారు. కరోనా వంటి కష్ట కాలంలో కూడా మంత్రులు శక్తివంచన లేకుండా పనిచేశారని జగన్ వారిని మెచ్చుకుంటూనే వారి సేవలను మరింతగా వాడుకుంటామని చెబుతారు అంటున్నారు.

ఒక విధంగా జగన్ తో మంత్రులకు ఇదే చివరి మీటింగ్ అని అంటున్నారు. అంటే ఈ సమావేశం తరువాత మంత్రుల నుంచి జగన్ రాజీనామాలు తీసుకుంటారు అని తెలుస్తోంది. ఆ మీదట వారికి విందు భోజనం పెట్టి సాగనంపుతారు అని తెలుస్తోంది. ఇక జగన్ మంత్రులందరి చేత రాజీనామాలు తీసుకున్న మీదట వాటిని గవర్నర్ కి పంపించి ఆమోదించుకుంటారు.

అలా పూర్తి స్థాయిలో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుంటారు అని తెలుస్తోంది. ప్రస్తుత మంత్రివర్గంలో జగన్ కాకుండా 24 మంది ఉంటే అందులో మేకపాటి గౌతం రెడ్డి గత నెలలో మరణించారు. ప్రస్తుతం 23 మంది మాంత్రులు మాత్రమే ఉన్నారు. వీరిలో ఎంతమంది కొత్త మంత్రి వర్గంలో కొనసాగుతారు అన్నది కూడా చూడాలి.

జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే ముందు చెప్పిన మాట ఏంటి అంటే తొంబై శాతం మంది మంత్రులను తొలగించి కొత్త వారికి చాన్స్ ఇస్తామని. అలా చూసుకుంటే ముగ్గురికి మాత్రమే పాత వారికి చాన్స్ ఉంటుంది. మరి ఆ ముగ్గురూ ఎవరూ అన్నది చూడాలి. ఇక రెండున్నరేళ్ళ తరువాత మంత్రి వర్గ విస్తరణ అన్నా కూడా కరోనా కారణంగా మంత్రులు బయటకు వెళ్ళలేని పరిస్థితి రావడంతో జగన్ వారికి మరో నాలుగు నెలల పాటు అవకాశం ఇచ్చారు.

బడ్జెట్ సమావేశాలను సైతం పాత మంత్రులతోనే నడిపించారు. అలా వారికి ఒక సంతృప్తి కలిగిందనే అధినాయకత్వం భావిస్తోంది. ఇక కొత్త మంత్రులుగా ఎవరు ఉంటారు అన్నది ఈ రోజుకైతే జగన్ మెదడులొనే ఉంది. ఆ లిస్ట్ బయటకు వచ్చేది మంత్రివర్గ ప్రమాణానికి కాస్తా ముందు మాత్రమే.

అన్నీ అనుకూలిస్తే మాత్రం ఏప్రిల్ 2 ఉగాది వేళ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుంది అని అంటున్నారు. మొత్తానికి జగన్ విందు భోజనం పెడుతున్నారు,మనసు విప్పి మాట్లాడుతున్నారు అన్న సంతోషం మంత్రులలో ఒక వైపు ఉంటే అదే రోజు తాము మాజీలం అవుతామా అన్న బెంగ మరో వైపు ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఏది ఏమైనా ఈ నెల 27 ఏపీలో ఒక సంచలన దినంగా మారుతుంది అంటున్నారు.