Begin typing your search above and press return to search.

నిర్భయ దోషులకు ఉరితాళ్లు రెఢీ అవుతున్నాయట

By:  Tupaki Desk   |   9 Dec 2019 6:44 AM GMT
నిర్భయ దోషులకు ఉరితాళ్లు రెఢీ అవుతున్నాయట
X
రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరించిన నేపథ్యంలో నిర్భయ దోషులకు ఉరిశిక్షను త్వరలో అమలు చేయటం ఖాయమని చెబుతున్నారు. ఈ వాదనలకు తగ్గట్లే.. నిర్భయ దోషులకు విధించిన ఉరిశిక్షను అమలు చేసేందుకు అవసరమైన ఉరితాడును తయారు చేయిస్తున్న సమాచారం బయటకువచ్చింది.

నిర్భయ దోషులకు ఉరి తీయటానికి అవసరమైన తాళ్లను తయారు చేసే పనిని బిహార్ రాష్ట్ర ఖైదీలకు అప్పగించారు. బిహార్ రాష్ట్రంలోని బుక్సర్ సెంట్రల్ జైలుఖైదీలు ఈ ఉరితాళ్లను పేనుతున్నారు. గతంలో పార్లమెంటుపై దాడి కేసులో ఉరిశిక్ష అమలు చేసిన అఫ్జల్ గురును ఉరి తీసినప్పుడు కూడా వీరు తయారు చేసిన ఉరితాళ్లనే వినియోగించారు.

గంగా నదీ తీరంలో ఉన్న బుక్సర్ సెంట్రల్ జైలు ఉరితాళ్ల తయారీలో చాలా పేరుంది. మూడు రోజుల క్రితమే తమకు నిర్భయ దోషులకు ఉరిశిక్షను అమలు చేసేందుకు అవసరమైన ఉరితాళ్ల ఆర్డర్ వచ్చినట్లుగా బుక్సర్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ విజయ్ కుమార్ ఆరోరా వెల్లడించారు. నిర్భయ దోషుల కోసం అవసరమైన ఉరితాళ్లను తమ జైల్లోని ఏడుగురు ఖైదీలు నాలుగు రోజుల పాటు శ్రమించి తయారు చేశారన్నారు.

గతంలో అఫ్జల్ గురు కోసం పేనిన ఉరితాడును రూ.1725 చొప్పున అమ్మామని.. ఈసారి ముడిసరుకు ధరలు పెరగటంతో ఉరితాడు రేటు పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఉరితాడు తయారీ కోసం అవసరమైన దారాల్ని గయకు చెందిన వస్త్రవ్యాపారుల వద్ద నుంచి తెప్పించినట్లు వెల్లడించారు.