Begin typing your search above and press return to search.

కేంద్రంతో తెగ‌తెంపులు ఐదు నిమిషాల ప‌ని!

By:  Tupaki Desk   |   9 Sep 2016 5:04 AM GMT
కేంద్రంతో తెగ‌తెంపులు ఐదు నిమిషాల ప‌ని!
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా బ‌దులుగా ప్యాకేజీతో స‌రిపెట్టిన‌ట్లు కేంద్రం దాదాపుగా చెప్పేసిన నేప‌థ్యంలో ఏపీలో అధికార టీడీపీ బాగా ఇరుకున ప‌డుతోంది. టీడీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు బీజేపీతో లాలూచీ ప‌డ‌టం వ‌ల్లే కేంద్రం ఏ మాత్రం ఏపీ ఆకాంక్ష‌లు ఖాత‌రు చేయ‌డం లేద‌నేది ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌. అందుకే కేంద్ర ప్ర‌భుత్వం నుంచి టీడీపీ బ‌య‌ట‌కు రావాల‌ని ఆయా పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో మిత్ర‌బంధంపై టీడీపీ సీనియ‌ర్ నేత‌ - ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆస‌క్తిక‌రంగా స్పందించారు. కేంద్రంతో తెగ‌తెంపులు చేసుకోవ‌డం చాలా చిన్న విష‌య‌మ‌ని చెప్పారు. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ విధంగా చేయ‌డం లేద‌న్నారు.

కేంద్రంలోని బీజేపీ - రాష్ట్రంలోని టీడీపీ ప్ర‌భుత్వానిది భార్య‌ - భ‌ర్త‌ల సంబంధం అని బుచ్చ‌య్య చౌద‌రి చెప్పారు. వైవాహిక బంధంతో ఒక్క‌టై విడిపోయిన తర్వాత భార్యభర్తలు బాగానే ఉంటారు... కానీ పిల్లల భవిష్యత్ ఎలా ఉంటుందో అంద‌రికీ తెలిసిందేన‌ని అన్నారు. అదే విధంగా కేంద్రంతో విడాకులు తీసుకోవడం ఐదు నిమిషాల పని అని, అయితే త‌ర్వాతి ప‌రిణామాలు ఏంటో ఆలోచించే సంయ‌మ‌నం పాటిస్తున్న‌ట్లు బుచ్చ‌య్య చౌద‌రి తెలిపారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై సీఎం చంద్రబాబు కూడా సంతృప్తి చెందలేదని చెప్పారు. కేంద్రం ఏమీ ఇవ్వకపోయినా ఏపీని 12శాతం వృద్ధిరేటులోకి తీసుకొచ్చిన ఘ‌న‌త చంద్ర‌బాబుద‌ని గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి కితాబిచ్చారు.

ఇదిలాఉండ‌గా కేంద్రం నుంచి టీడీపీ బయటికు రావాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై రెండున్నరేళ్లు ఊరించి ఏపీ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి వెంక‌య్య నాయుడు, రాష్ట్రంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ఊరించి ఉసూరుమ‌నిపించిన చందంగా ఆఖ‌రికి ప్యాకేజీతో ప్యాక‌ప్ చేశార‌ని వ్యాఖ్యానించారు. అందుకే చంద్ర‌బాబుకు ఆయ‌న పార్టీ సిద్ధాంత‌మైన ఆత్మగౌర‌వం అనే ప‌దానికి అర్థం తెలిస్తే.... కేంద్రం నుంచి వైదొల‌గాల‌ని నారాయ‌ణ‌ కోరారు.