Begin typing your search above and press return to search.

ఆ వ్యాపారి ఆఫీసు గోడను బద్ధలు కొడితే నోట్ల కట్టలు రాలాయి

By:  Tupaki Desk   |   27 April 2022 4:31 AM GMT
ఆ వ్యాపారి ఆఫీసు గోడను బద్ధలు కొడితే నోట్ల కట్టలు రాలాయి
X
డబ్బులు ఎక్కువై.. ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఒక వ్యాపారి చేసిన పనికి నోరెళ్ల బెడుతున్నారు అధికారులు. కట్టలు కొద్దీ నోట్లు.. వెండి ఇటుకలు దర్శనమివ్వటంతో అవాక్కు అవుతున్నారు. సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. ముంబయికి చెందిన చాముండా అనే వ్యాపారి బిజినెస్ టర్నోవర్ అడ్డూ ఆపూ లేకుండా పెరిగిపోవటాన్ని అధికారులు గుర్తించారు.

మూడేళ్ల వ్యవధిలో రూ.23 లక్షల టర్నోవర్ నుంచి ఏకంగా రూ.1764 కోట్లకు పెరగటాన్ని చూసి షాక్ తిన్నారు. ఈ వ్యాపారి వ్యాపారం గురించి ఆరా తీయటం షురూ చేశారు. చాలా తక్కువ వ్యవధిలో ఇంత భారీగా వ్యాపారాన్ని ఎలా పెంచాడు? ఆ సొమ్మునుఏం చేశాడు? అన్నది ప్రశ్నగా మారింది.

దీంతో.. ఈ లెక్క తేల్చేందుకు రంగంలోకి దిగిన అధికారులు గుట్టుగా అతని గురించి సమాచారం సేకరించారు. పక్కాగా ప్లాన్ చేసి.. సదరు వ్యాపారి ఆఫీసుకు వెల్లారు.

కల్బాదేవిలో ఉన్న 35 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఆఫీసులో ఏమీ లభించలేదు. తమకు వచ్చిన సమాచారం పక్కా కావటంతో.. లెక్కలో ఎక్కడ తేడా కొట్టిందా? అని జాగ్రత్తగా చూడసాగారు.

ఈ సందర్భంగా గది నేల మీద అమర్చిన టైల్ ఒకటి మిగిలిన వాటికి కాస్త భిన్నంగా ఉండటంతో.. ఈ టైల్ ను తొలగించారు. అందులో నోట్ల కట్టలు కుక్కిన గోనె సంచులు దర్శనమిచ్చాయి.దీంతో.. అలెర్టు అయిన వారు.. గది మొత్తాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు.

ఆ గదిలోకి నోట్ల కట్టలు ఎలా వచ్చాయో తమకు తెలీదని అమాయకంగా చెబుతున్న వేళ.. గదిలో ఏర్పాటు చేసిన రహస్య అరనుగుర్తించారు. అందులో 19 కేజీల వెండి ఇటుకలతో పాటు.. రూ.10కోట్ల విలువైన నోట్ల కట్టల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహరంపై ఐటీ శాఖకు అధికారులు సమాచారం ఇచ్చారు. ఏమైనా.. నోట్ల కట్టల్ని అంతలా దాచినా.. పాపం పండినప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు చెప్పండి?