Begin typing your search above and press return to search.

అరుణాచల్ దగ్గరికి బుల్లెట్ రైలు.. చైనా మరో ఎత్తుగడ!

By:  Tupaki Desk   |   26 Jun 2021 4:49 AM GMT
అరుణాచల్ దగ్గరికి బుల్లెట్ రైలు.. చైనా మరో ఎత్తుగడ!
X
తమదేశ సరిహద్దు ప్రాంతాన్ని పెంచుకోవాలనే లక్ష్యంతో అడుగులు ముందుకు వేస్తున్న చైనా, పొరుగు దేశాల భూభాగాలను ఆక్రమించుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. గతేడాది మే నుంచి తూర్పు లడఖ్ సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించిన చైనా మరింత వేగంగా తరలించేందుకు అవసరమైన వనరులను ఒక్కొక్కటిగా సమకూర్చుకుంటుంది. ఇందులో భాగంగానే అరుణాచల్‌ ప్రదేశ్‌ కు అత్యంత సమీపంలో ఉన్న టిబెట్‌ సరిహద్దు ప్రాంతానికి బుల్లెట్‌ రైలును ప్రారంభించింది. దీనితో బలగాలను వేగంగా వాస్తవాధీన రేఖ వద్దకు చేర్చే అవకాశం లభిస్తుంది.

కాగా, టిబెట్‌ లో ఇది రెండవ రైల్వే లైన్. ఇప్పటికే క్వింఘాయ్‌-టిబెట్ రైల్వే మార్గం అందుబాటులో ఉంది. టిబెట్ రాజధాని లాసా నుంచి అరుణాచల్ ప్రదేశ్‌ కు అత్యంత సమీపంలో ఉన్న నింగ్చీ వరకు 435.5 కిలో మీటర్ల మేర ఈ రైల్వేలైనును ఏర్పాటు చేసింది. చైనా కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా డ్రాగన్ దేశం ఈ బుల్లెట్‌ ట్రైన్‌ ప్రారంభించింది. ఈ బుల్లెట్ రైలు కోసం లాసా, నింగ్చీ మధ్య 2014లోనే పనులు ప్రారంభించారు. టిబెట్‌లో పూర్తి స్థాయి విద్యుదీకరించిన మొట్టమొదటి రైల్వే లైన్ ఇదే కావడం విశేషం.

ఈ రైలు మార్గం నిర్మాణంతో చెంగ్డూ నుంచి లాసా వెళ్లేందుకు గతంలో 48 గంటల సమయం పడుతుండగా, తాజాగా బుల్లెట్‌ ట్రైన్‌ ప్రారంభంతో ఇది 13 గంటలకు తగ్గబోతోంది. హిమాలయ ప్రాంతంలోని 4వేల కిలోమీటర్లకుపైగా సరిహద్దులపై పట్టు సాధించాలంటే టిబెట్‌ కీలకం కావడంతో చైనా వ్యూహాత్మకంగా ఈ బుల్లెట్ ట్రైన్ ను సిద్ధం చేసింది. అయితే , ఇప్పటికే అరుణాచల్‌‌ను దక్షిణ టిబెట్‌లోని భాగమని డ్రాగన్ చేస్తున్న వితండవాదానికి భారత్‌ ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూనే ఉంది. దీంతో చైనా కొత్త ఎత్తుగడలు వేస్తోంది. మౌలిక సౌకర్యాల ముసుగులో సరిహద్దులకు చేరువగా వస్తోంది.