Begin typing your search above and press return to search.

జగన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన బుద్ధా వెంకన్న

By:  Tupaki Desk   |   18 March 2020 12:30 PM GMT
జగన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన బుద్ధా వెంకన్న
X
కరోనా వైరస్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో అంతగా లేకున్నా మాత్రం రాజకీయాలను మాత్రం తీవ్రంగా ఉంది. వాస్తవానికి భిన్నంగా ప్రకటించి ఎన్నికలను వాయిదా వేయడం తో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాత్రం తీవ్ర వాగ్వాదం ఏర్పడింది. ఏపీ రాజకీయాల్లో కరోనా వైరస్ పై దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వైఎస్ జగన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశాడు. ఈ విషయంలో జగన్ కుమార్తెలను వార్తల్లోకి లాగాడు.

ఇటీవల ముఖ్యమంత్రి జగన్ కరోనా వైరస్‌పై చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశాడు. టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్వీటర్ వేదికగా స్పందిస్తూ.. పేరాసిటమాల్ వేస్తే కరోనా పారిపోతుందని, బ్లీచింగ్ పౌడర్ జల్లితే కరోనా చచ్చిపోతుందని జగన్ సెలవిచ్చారు.. అసలు కరోనా పెద్ద విషయమే కాదు అన్న జగన్ ఆయన ఇద్దరు కుమార్తెలను లండన్ నుంచి ఎందుకు వెనక్కి పిలిపించారని ప్రశ్నించారు. అంటే ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయినా పర్లేదు కానీ.. రాష్ట్రంలో ఉన్న పిల్లలు కరోనా బారిన పడినా పర్లేదా అంటూ నిలదీశారు. జగన్ గారి కుటుంబం మాత్రం హాయిగా తాడేపల్లి కోటలో సురక్షితంగా ఉండాలా.. మరీ ఇంత స్వార్థమా అని మండిపడ్డారు.

ఈ విధంగా జగన్ కుమార్తెలను రాజకీయాల్లోకి బుద్దా వెంకన్న లాగడం సరికాదని పలువురు పేర్కొంటున్నారు. చదువుకుంటున్న అమ్మాయిలను.. పైగా ఒక ముఖ్యమంత్రి కుటుంబసభ్యులను ఈ విధంగా విమర్శించడం సరికాదని ప్రజలు తప్పుబడుతున్నారు. ఆయన వైఖరి మారాలని.. ఏదైనా ఉంటే రాజకీయంగా తేల్చుకోవాలి కానీ ఇలా విమర్శలు చేయడం నాయకుడి లక్షణం కాదని హితవు పలుకుతున్నారు.