Begin typing your search above and press return to search.

మోడీకి బాబుకు ఎక్క‌డ చెడిందంటే...

By:  Tupaki Desk   |   1 Aug 2016 10:50 AM GMT
మోడీకి బాబుకు ఎక్క‌డ చెడిందంటే...
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు ప్ర‌త్యేక హోదా అంశం మిత్ర‌ప‌క్షాలైన బీజేపీ-టీడీపీల మ‌ధ్య మాట‌ల యుద్ధాన్ని పెంచుతోంది. ఆయా పార్టీల నేత‌లు ఏకంగా గ‌తం త‌వ్వ‌డం మొద‌లు పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత - ఏపీ సీఎం చంద్ర‌బాబు అనుంగ అనుచ‌రుడిగా పేరొందిన ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న తాజాగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోడీపై విరుచుకుప‌డ్డారు. చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రానికి ఎటువంటి సాయం చేయకుండా మోడీ అన్యాయం చేస్తున్నారని బుద్ధా వెంకన్న విమర్శించారు.

విజయవాడలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వెంక‌న్న సీఎం చంద్రబాబుపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు. చంద్రబాబు చరిష్మాను దెబ్బతీసేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారని విమ‌ర్శించారు. గోధ్రా అల్లర్లలో మోడీని గ‌తంలో చంద్ర‌బాబు తప్పుపట్టడాన్ని మనసులో పెట్టుకుని రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. మోడీ తప్పులను చంద్ర‌బాబు బయట పెట్టడమే నేరంగా మారిందని అందుకనే రాష్ట్రానికి నిధుల కోత కోస్తున్నారన్నారు. రాజధానికి నీరు - మట్టి ఇచ్చి చేతులు దులుపుకున్నారని మోడీపై దుయ్యబట్టారు. చంద్రబాబు తలుచుకుంటే మోడీ కంటే ముందే ప్రధాని అయ్యుండేవారని వెంక‌న్న‌ తెలిపారు. బీజేపీ నేతలు కావూరి - పురందేశ్వరిలు రాష్ట్ర ప్రభుత్వంపై ఇకనైనా వ్యతిరేక ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. విజయవాడలో దేవాలయాలు తొలగిస్తే అల్లర్లు చేసిన సోము వీర్రాజు - గోకరాజు గంగరాజు - కన్నా లక్ష్మీనారాయణ ఈ రోజు హోదా ఇవ్వనంటే ఎందుకు మాట్లాడటం లేదని వెంక‌న్న‌ ప్రశ్నించారు. కేవలం తమ ఆస్తులను కాపాడుకోవడానికే వీరంతా అధికార బీజేపీలో చేరారని ఎద్దేవా చేశారు. బీజేపీతో తెగతెంపులు చేసుకుంటే మంచిదన‌దే త‌న‌ అభిప్రాయ‌మ‌ని వెంక‌న్న తెలిపారు. తెలుగువారంతా ఒక్కటవ్వాలని, ప్రత్యేక హోదా వచ్చే వరకూ పోరాటం చేయాలని కోరారు.