Begin typing your search above and press return to search.

మిర్యాల‌గూడ న‌డిరోడ్డు మీద ప‌రువు హ‌త్య‌!

By:  Tupaki Desk   |   15 Sep 2018 5:44 AM GMT
మిర్యాల‌గూడ న‌డిరోడ్డు మీద ప‌రువు హ‌త్య‌!
X
ఆ ఇద్ద‌రిని చూస్తే.. ఈడుజోడు అనేలా ఉంటారు. చూడ‌ముచ్చ‌ట‌గా ఉన్న ఈ జంట‌కు అయిన‌వాళ్లే శాప‌మ‌య్యారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారంటూ క‌క్ష పెంచుకొని.. త‌మ‌కంటే త‌క్కువ కులం వాడిని కూతురు పెళ్లి చేసుకుంద‌ని ర‌గిలిపోయిన తండ్రి.. కసాయి మ‌నుషుల‌తో క‌సిగా చంపించిన తీరు న‌ల్గొండ జిల్లాలోనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిప‌డేలా చేశాయి.

ఎంత ప్రేమిస్తే మాత్రం.. మ‌రి ఇంత దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తారా? అన్న సందేహం క‌లిగించేలా ఉన్న ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు అంద‌రిని క‌దిలించి వేస్తోంది. కూతురు గ‌ర్బ‌వ‌తి అన్న విష‌యాన్ని కూడా ప‌ట్టించుకోకుండా ఆసుప‌త్రి ఆవ‌ర‌ణ‌లో క‌త్తితో అల్లుడి మెడ‌ను న‌రికేయించిన ఈ కసాయి తండ్రి తీరుపై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. న‌ల్గొండ జిల్లా మిర్యాల‌గూడ‌లో చోటు చేసుకున్న ఈ ప‌రువు హ‌త్య వివ‌రాల్లోకి వెళితే..

మిర్యాల‌గూడ‌కు చెందిన మాల సామాజిక వ‌ర్గానికి చెందిన 24 ఏళ్ల ప్ర‌ణ‌య్ బీటెక్ పూర్తి చేశాడు. కెన‌డా వెళ్లే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు. ప్ర‌ణ‌య్ తండ్రి బాల‌స్వామి మిర్యాల‌గూడలోని ఎల్ఐసీలో ఉద్యోగి. అదే ఊరికి చెందిన వైశ్య సామాజిక వ‌ర్గానికి చెందిన రియ‌ల్ట‌ర్ మారుతిరావు ఏకైక కుమార్తె అమృత. ఆమె బీటెక్ చ‌దువుతోంది. ప్ర‌ణ‌య్.. అమృత‌లు ఇంట‌ర్లో ఉండ‌గా వారి మ‌ధ్య ప్రేమ చిగురించింది. ఇంట్లో విష‌యాన్ని చెబితే నో చెప్పారు. త‌న కుమార్తెను వ‌దిలేస్తే ప్ర‌ణ‌య్ కు రూ.3 కోట్లు ఇస్తాన‌ని అమృత తండ్రి ఆఫ‌ర్ ఇచ్చినా.. అందుకు అత‌గాడు నో చెప్పాడు.

ఈ జ‌న‌వ‌రిలో వారిద్ద‌రి వివాహం హైద‌రాబాద్‌లోని ఆర్య‌స‌మాజంలో జ‌రిగింది. వీరి పెళ్లికి అమృత తండ్రి తీవ్రంగా ర‌గిలిపోయాడు. త‌న ప‌రువుకు భంగం వాటిల్లింద‌ని భావించాడు. కులాలు వేరైనందున‌.. ఊళ్లో త‌న ప‌రువు పోయింద‌ని భావించి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. త‌న తండ్రి కార‌ణంగా భ‌ర్త‌కు ఏమైనా జ‌ర‌గొచ్చ‌న్న సందేహంతో పోలీసుల్ని ఆశ్ర‌యించింది అమృత‌. త‌న భ‌ర్త‌కు ఏదైనా జ‌రిగితే త‌న తండ్రిదే బాధ్య‌త అని పేర్కొన‌గా.. ఆయ‌న్ను స్టేష‌న్ కు తీసుకొచ్చిన పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు.

గ‌డిచిన కొద్దికాలంగా బాగానే ఉన్న‌ట్లుగా న‌టించిన అమృత తండ్రి.. ప‌క్కా ప్లాన్ వేశారు. ప్ర‌స్తుతం గ‌ర్బ‌వ‌తి అయిన అమృత ఆసుప‌త్రిలో వైద్య ప‌రీక్ష‌ల కోసం వ‌చ్చింది. ఈ విష‌యాన్ని గుర్తించిన ఆమె తండ్రి.. తాజాగా వైద్య ప‌రీక్ష‌లు చేయించుకొని కారు వ‌ద్ద‌కు వెళుతున్న వారిపైన కిరాయి హంత‌కుడితో హ‌త్య చేయించారు. వెనుక నుంచి వ‌చ్చి ప‌దునైన క‌త్తితో ప్ర‌ణ‌య్ త‌ల న‌రికారు. న‌రికిన తీవ్ర‌త ఎంత ఎక్కువ‌గా ఉందంటే.. ముప్పాతిక వ‌ర‌కు త‌ల తెగిపోయింది. దీంతో.. ఘ‌ట‌నాస్థ‌లంలోనే ప్ర‌ణ‌య్ మ‌ర‌ణించాడు. ఈ ప‌రువు హ‌త్య సంచ‌ల‌నంగా మారింది. సీసీ ఫుటేజ్ లో ఈ హ‌త్య ఉదంతం స్ప‌ష్టంగా క‌నిపించింది. ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడి అమృత తండ్రి మారుతిరావును చేర్చారు. ఈ ఘ‌ట‌న‌కు నిర‌స‌న‌గా ఈ రోజు (శ‌నివారం) మిర్యాల‌గూడ‌లో బంద్ నిర్వ‌హించ‌నున్నారు. ఒక‌రి కోస‌మే ఒక‌రు పుట్టార‌న్న‌ట్లుగా చూడ‌చ‌క్క‌గా ఉండే ఈ జంటకు ఎదురైన దారుణం ఇప్పుడు అంద‌రిని క‌దిలించివేస్తోంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె.. జీవితాంతం ఒక‌రితో సంతోషంగా ఉంటాన‌ని చెబితే నో అనే తండ్రిని అర్థం చేసుకోవ‌చ్చు. కానీ.. ఇలా దారుణంగా హ‌త్య చేయించే దుర్మార్గాన్ని ఎంత ఆలోచించినా అర్థం చేసుకోలేని ప‌రిస్థితి. ఇలాంటి దుర్మార్గానికి పాల్ప‌డిన వ్య‌క్తికే కాదు.. దారుణానికి ప్లాన్ చేసిన వ్య‌క్తిని అస్స‌లు క్ష‌మించ‌కూడ‌దు.