Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ కోసం నాడు ష‌ర్మిల‌.. నేడు అనిల్‌!!

By:  Tupaki Desk   |   18 Oct 2017 10:16 AM GMT
జ‌గ‌న్ కోసం నాడు ష‌ర్మిల‌.. నేడు అనిల్‌!!
X
అక్ర‌మాస్తుల కేసులో వైసీపీ అధినేత జ‌గ‌న్ జైలులో ఉన్న స‌మ‌యంలో.. ఆయన సోద‌రి ష‌ర్మిల రాష్ట్ర‌మంతా పాద‌యాత్ర చేసి పార్టీలో జ‌వ‌స‌త్వాలు నింపారు! వైసీపీ భారాన్ని త‌న భుజ‌స్కందాల‌పై వేసుకుని.. పార్టీ బ‌లోపేతానికి అహ‌ర్నిశ‌లు కృషిచేశారు! ఆమె పాద‌యాత్ర గ్రామ‌స్థాయిలో వైసీపీ బ‌లోపేతానికి పునాది వేసింది. ఇక 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఎలాగైనా విజ‌యం సాధించేందుకు ష‌ర్మిల భ‌ర్త‌, జ‌గ‌న్ బావ‌ అనిల్ కుమార్ రంగంలోకి దిగారు! ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న ఆయ‌న‌.. ఇప్పుడు పార్టీ బ‌లోపేతానికి త‌నకు తోచిన స‌ల‌హాలు - సూచ‌న‌లు ఇస్తున్నారు! అంతేగాక త‌న ప‌రిచ‌యాల‌ను ఉప‌యోగించి జ‌గ‌న్ విజ‌యానికి బాట‌లు వేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

`జ‌గ‌న్ కొంద‌రివాడే`న‌ని టీడీపీ నేత‌లు గ‌త ఎన్నిక‌ల్లో విప‌రీతంగా ప్ర‌చారం చేశారు. ఈ ప్ర‌చారం జ‌నాల్లోకి వెళ్ల‌డంతో కొన్ని వ‌ర్గాల ఓటర్లు వైసీపీని దూరం పెట్టాయి! అయితే ఇప్పుడు `నేను కొంద‌రి వాడిని కాదు.. అందరివాడినీ` అని నిరూపించుకునే ప‌నిలో ప‌డ్డారు జ‌గ‌న్‌! ఫ‌లితంగా అప్పుడు దూరమైన వ‌ర్గాలను అక్కున చేర్చుకునేందుకు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కొంత కాలం నుంచి.. జ‌గ‌న్ ఒక ప‌క్కా వ్యూహంతో అడుగులేస్తున్నార‌నేది అందరి అభిప్రాయం! ఇటీవ‌ల హిందువుల‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు స్వామీజీల చుట్టూ జ‌గ‌న్ తిరుతున్నారు. ఇటీవలే త్రిదండి చినజీయర్ స్వామిని కూడ జగన్ కలిసి ఆయ‌న ఆశీర్వాదాలు తీసుకున్నారు.

ఇక న‌వంబ‌రు 2 నుంచి పాదయాత్ర చేయ‌బోతున్నారు. ఇది విజయవంతం కావాలని తిరుపతికి వెళ్ల‌నున్నారు. అయితే ఈ ప‌రిణామాల‌న్నీ ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్న క్రిస్టియ‌న్ల‌లో కొంత క‌ల‌వ‌రాన్ని క్రియేట్ చేసేలా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో వారి బాధ్య‌త‌ను బ్ర‌దర్ అనీల్‌ కు జ‌గ‌న్ అప్ప‌జెప్పిన‌ట్లు తెలుస్తోంది! తమకు సంప్రదాయంగా అండగా ఉంటున్న వారిని కాపాడేందుకు ఆయ‌న వెంట‌నే రంగంలోకి దిగిపోయార‌ట‌. అంతేగాక ఇటీవ‌ల ద‌ర్శ‌కుడు రామ్‌ గోపాల్ వ‌ర్మ‌తోనూ ఆయ‌న భేటీ అయ్యారు. ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర ఆధారంగా `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌` తెర‌కెక్కించ‌డం.. హీట్ రేపుతున్న త‌రుణంలో.. వ‌ర్మ‌తో అనిల్ భేటీ కావ‌డం రాజ‌కీయంగా క‌ల‌కం రేపిన విష‌యం తెలిసిందే!

వైఎస్ జగన్‌ ను సీఎం చేసేందుకు తనకు కలిసివచ్చే ప్రతి అవకాశాన్ని అనిల్ వినియోగించుకొంటున్నారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. వైఎస్ హయంలో చోటుచేసుకొన్న పరిణామాలపై సినిమా తీయాలని బ్రదర్ రామ్‌ గోపాల్ వర్మను కోరినట్టు ప్రచారం కూడా సాగుతోంది. ఇక ఏపీలో జిల్లాల వారీగా తనకున్న పరిచయాలను వైసీపీని బలోపేతం చేసేందుకు అనిల్ ప్రయత్నిస్తున్నారట‌. గ‌తంలో సోద‌రి ష‌ర్మిల‌ ఎన్నికల ప్రచారం చేయ‌గా.. ఇప్పుడు అనిల్ కూడా రంగంలోకి దిగారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.