Begin typing your search above and press return to search.

బ్రిట‌న్ ఎన్నిక‌ల్లో ప్ర‌ధానికి దిమ్మ‌తిరిగే షాకిచ్చిన మ‌నోళ్లు

By:  Tupaki Desk   |   16 Dec 2019 4:54 AM GMT
బ్రిట‌న్ ఎన్నిక‌ల్లో ప్ర‌ధానికి దిమ్మ‌తిరిగే షాకిచ్చిన మ‌నోళ్లు
X
యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)తో బ్రిటన్‌ విడాకుల (బ్రెగ్జిట్‌) వ్యవహారం ఎటూ తేలని నేపథ్యంలో... అంతర్జాతీయంగా ఆసక్తి రేకెత్తించిన బ్రిటన్‌ ఎన్నికల్లో కీల‌క‌ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కు ఓటర్లు అఖండ మెజార్టీని కట్టబెట్టారు. వచ్చే ఏడాది జనవరి 31లోగా బ్రెగ్జిట్‌ ప్రక్రియను పూర్తి చేస్తామన్న బోరిస్‌ కు మరోసారి అధికార పగ్గాలు అప్పగించారు. ఆయనకు చెందిన అధికార కన్జర్వేటివ్‌ పార్టీ తాజా ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. జెరెమీ కోర్బిన్‌ సారథ్యంలోని ప్రతిపక్ష లేబర్‌ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఈ ఎన్నికల్లో బ్రిటన్‌ లోని భారత సంతతి ప్రజలు కీలకపాత్ర పోషించారు. భారత్‌ కు వ్యతిరేకంగా వ్యవహరించిన లేబర్‌ పార్టీకి తమ సత్తా చూపించారు. ఇంతకుముందు భారతీయులు గంపగుత్తగా ఏపార్టీకి ఓటేసిన దాఖలాలు లేవు. తమకు నచ్చిన పార్టీకి ఓటేసేవారు. ఈసారి భారత రాజకీయ ధృక్కోణంలోనే ఓటు వేశారు.

జమ్ముకశ్మీర్‌ కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా లేబర్‌ పార్టీ ఆ దేశ పార్లమెంట్‌ లో అత్యవసర తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. జమ్ముకశ్మీర్‌ లో మానవ హక్కులను హరిస్తున్నారని, కశ్మీర్‌ లోయలో భారత ప్రభుత్వం వ్యవస్థీకృత లైంగికదాడులకు ఆదేశిస్తున్నదని ఆ తీర్మానంలో ఆరోపించడం బ్రిటన్‌ లోని భారతీయులకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. తీర్మానంపై నిరసన వ్యక్తం చేస్తూ సుమారు 130 భారతీయ సంఘాలు లేబర్‌ పార్టీకి లేఖలు రాశాయి. ఎన్నికల ప్రకటన వెలువడ్డాక సంప్రదాయంగా లేబర్‌ పార్టీకి మద్దతునిస్తున్న భారతీయులను ఆ పార్టీకి మద్దతు ఉపసంహరించుకునేలా ప్రచారం ప్రారంభించాయి. దీనిపై కన్జర్వేటివ్‌ పార్టీ నేత రామిరేంజర్‌ స్పందిస్తూ.. ‘ఇలా ఎప్పుడూ జరుగలేదు. ఈ ఎన్నికల్లో బ్రిటన్‌ లోని భారతీయులు రాజకీయ శక్తిగా ఎదిగారు’అని పేర్కొన్నారు.

ఎన్నికలకు కొద్ది వారాల ముందు గ్రూప్‌ ఇండియా ఇంక్‌ నిర్వహించిన సర్వేలో పెద్ద ఎత్తున భారతీయులు లేబర్‌ పార్టీకి మద్దతు ఉపసంహరించుకున్నట్లు తేలింది. భారతీయ ఓట్లతో కనీసం 10 స్థానాల్లో కన్జర్వేటివ్‌ అభ్యర్థులు విజయం సాధించారని ఆ పార్టీ ఎంపీ బాబ్‌ బ్లాక్‌ మ్యాన్‌ అభిప్రాయపడ్డారు. ప్రధాని - కన్జర్వేటివ్‌ పార్టీ అధినేత బోరిస్‌ జాన్సన్‌ భారతీయులను ఆకర్షించేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తన క్యాబినెట్‌ లో కీలకమైన హోంశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న భారత సంతతికి చెందిన ప్రీతీపటేల్‌ తో కలిసి వాయవ్య లండన్‌ లో ప్రసిద్ధ స్వామి నారాయణ్‌ ఆలయాన్ని సందర్శించారు. నవభారత్‌ నిర్మాణం కోసం ప్రధాని మోదీ తో కలిసి పనిచేస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆయ‌న‌కు భార‌తీయులు అండ‌గా నిలిచారు.