Begin typing your search above and press return to search.

మేయ‌ర్‌ కు అవ‌మానం..రాజీనామా..కేసు

By:  Tupaki Desk   |   29 Nov 2017 4:14 AM GMT
మేయ‌ర్‌ కు అవ‌మానం..రాజీనామా..కేసు
X
మెట్రో ప్రారంభోత్సవం సంద‌ర్భంగా చోటుచేసుకున్న ప‌రిణామాల్లో కొత్త ప‌రిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు తలమానికమైన మెట్రో ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా నగర ప్రథమ పౌరుడు మేయర్‌ బొంతు రామ్మోహన్‌కు ఘోర పరాభావం ఎదురైందని వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. మెట్రో ప్రాజెక్టు పైలాన్‌పై ఏర్పాటు చేసిన శిలాపలకంలో మేయర్‌ పేరు లేదు. అంతేగాకుండా పైలాన్‌ ఆవిష్కరణలోనూ వేదిక పైకి వెళ్లనివ్వలేదు. మియాపూర్‌ మెట్రోస్టేషన్‌ ప్రారంభంలోనూ అదే పరిస్థితి ఎదురైందని. మెట్రో ప్రాజెక్టుపై రూపొందించిన డాక్యుమెంటరీ ప్రదర్శనలోనికి అనుమతించలేదు. గవర్నర్‌ నర్సింహన్‌, సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, మహ్మద్‌అలీలకు మాత్రమే అనుమతిచ్చారు. ఆ తర్వాత మెట్రో రైలు ప్రయాణంలోనూ ప్రధాని, సీఎం, గవర్నర్‌లతో పాటుగా నగర మేయర్‌కు సీటు లేదు. కానీ, ఏ ప్రోటోకాల్‌ లేకుండా బీజేపీ నేతలు కిషన్‌ రెడ్డి, లక్ష్మణ్‌లకు ప్రాధాన్యతివ్వడం విశేషం.

అయితే నగర ప్రథమ పౌరుడికి సొంత పార్టీ నుంచే అవమానం ఎదురైందన్న విమర్శలున్నాయి. నగరానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి - ప్రధాని - విదేశీ అతిథులు ఎవ్వరూ వచ్చిన మొదట మేయర్‌ ఆహ్వానం పలుకుతారు. గతంలో టీడీపీ - కాంగ్రెస్‌ ప్రభుత్వాల్లో పని చేసిన మేయర్లకు ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్‌ ప్రకారం ప్రథమ స్థానమిచ్చారు. స్వరాష్ట్రంలో తొలి నగర మేయర్‌ కు ప్రొటోకాల్‌ దక్కడం లేదు. హకీంపేటకు రాష్ట్రపతి వస్తే గ్రేటర్‌ పరిధి కాదంటున్నారు. శంషాబాద్‌ విమానశ్రయంలోనూ అదే పరిస్థితి ఉంది. ప్రస్తుతం జీఈఎస్‌ సదస్సుకు ప్రపంచ స్థాయి ప్రతినిధులు వస్తున్నా మేయర్‌కు ఆహ్వానం లేకపోవడం విశేషం. దీంతోపాటు మెట్రోరైలు ప్రారంభోత్సవంలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌కు ప్రాధాన్యత ఇవ్వలేదని, మేయర్‌ రాజీనామా చేస్తున్నట్టు సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ప్రతిపక్షపార్టీ నేతలను ఆహ్వానించలేదని దుమారం రేగుతున్న సమయంలో లక్ష్మన్‌ - కిషన్‌ రెడ్డిలకు ప్రాధాన్యతనివ్వడం చర్చనీయాంశంగా మారింది.

తాను రాజీనామా చేసినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తాను రాజీనామా చేశానని, బీసీలకు చెందిన వ్యక్తి కాబట్టే మెట్రో ప్రారంభోత్సవంలో శిలాఫలకంపై తన పేరు వేయలేదని సోషల్‌ మీడియాలో వచ్చిన తప్పుడు వార్తలపై కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని సైబర్‌ క్రైమ్‌ అదనపు డీసీపీ రఘువీర్‌ కు ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. ఇలాంటి ప్ర‌చారాలు స‌రికాద‌న్నారు.