Begin typing your search above and press return to search.

విశాఖలో ‘తమ్ముడి’ మీద బాంబు దాడి

By:  Tupaki Desk   |   20 Jun 2016 4:48 AM GMT
విశాఖలో ‘తమ్ముడి’ మీద బాంబు దాడి
X
ప్రశాంత రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకునే విశాఖ తీరం ఉలిక్కిపడేలా చోటు చేసుకున్న ఘటన ఇది. విశాఖ డెయిరీ డైరెక్టర్.. టీడీపీ నేత గేదెల సత్యనారాయణపై బాంబు దాడి జరగటం ఇప్పుడు కలకలం రేపుతోంది. సంచలనంగా మారిన ఈ ఉదంతానికి సంబంధించి ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్న వివరాలుచూస్తే..

విశాఖ జిల్లా బుచ్చెయ్యపేట మండలం మళ్లపూడిలో టీడీపీ సమావేశం జరిగింది. దీనికి గేదెల సత్యనారాయణ పాల్గొన్నారు. పల్లెల్లో చేపట్టాల్సిన ఏరువాక పనులపై కార్యకర్తలతో ఆయన మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా అక్కడికి దగ్గర్లోని చెరుకు తోటలో దాక్కున్న ఒక ఆగంతుకుడు ఒక్కసారిగా సమావేశంలోకి దూసుకొచ్చి.. సత్యనారాయణపై నాటుబాంబు విసిరారు.

క్షణాల్లో చోటు చేసుకున్న ఈ ఘటనకు తేరుకునే లోపే బాంబు పేలిపోవటం.. దాని ఇనుపముక్కలు సత్యనారాయణ శరీరంలోకి దూసుకెళ్లటం జరిగిపోయాయి. బాంబుదాడిలో రక్తసిక్తమైన ఆయన్నుదగ్గర్లోని రావికమతానికి చేర్చారు. ప్రాధమిక చికిత్స అనంతరం.. డాక్టర్ సూచన మేరకు వెంటనే ఆయన్ను విశాఖకు తరలించారు. తీవ్రంగా గాయపడిన ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది.