Begin typing your search above and press return to search.

బ్లూ ఆరిజిన్‌ vs నాసా .. వర్జిన్‌ గెలాక్టిక్‌ పర్యటన రోదసి యాత్రేనా?

By:  Tupaki Desk   |   13 July 2021 7:09 AM GMT
బ్లూ ఆరిజిన్‌ vs నాసా ..  వర్జిన్‌ గెలాక్టిక్‌ పర్యటన రోదసి యాత్రేనా?
X
వర్జిన్‌ గెలాక్టిక్‌..తాజాగా రోదసి యాత్రకి వెళ్లొచ్చింది. ఆదివారం ‘వర్జిన్‌ గెలాక్టిక్‌’ యాత్రలో రిచర్డ్‌ బ్రాన్సన్‌, తెలుగమ్మాయి శిరీష బండ్ల, మరో నలుగురు భూమికి 88 కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్లారు. అక్కడ భారరహిత స్థితిలో తేలుతున్న దృశ్యాలను లైవ్‌ స్ట్రీమింగ్‌ లో చూపించారు. అయినా, అది రోదసిలోకి వెళ్లినట్లు కాదా అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దీనిపైనే చర్చ కోనసాగుతోంది. ఒకరకంగా రోదసి యాత్రకి ఇది అడుగులు వేసినా కూడా కొందరు దీన్ని రోదసి యాత్ర కాదు అంటూ వాదిస్తున్నారు. అయితే , ఇది రోదసి యాత్రనే అంటూ నాసా వారికి అభినందనలు తెలిపింది.

సాధారణంగా భూ వాతావరణ పరిధి దాటితే రోదసి అంటారు. కానీ, కర్మన్‌ లైన్‌ ను దాటితే రోదసిలోకి చేరినట్లని ప్రపంచ దేశాలు ఒక ప్రామాణికాన్ని పెట్టుకున్నాయి. సముద్ర మట్టానికి 100 కిలోమీటర్ల ఎత్తు దాటితే కర్మన్‌ లైన్‌ ఉంటుందని నిర్దారించారు. ప్రపంచంలోని 96 దేశాలు కర్మన్‌ లైన్‌ కు 100 కిలోమీటర్ల దూరాన్ని నిర్దేశించుకున్నాయి. అమెరికా సహా.. మిగతా దేశాలు మాత్రం 80 కిలోమీటర్లు దాటితే రోదసిలోకి వెళ్లినట్లని చెప్తాయి. నిజానికి రోదసి సరిహద్దుపై ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఒప్పందం లేదు. అయితే.. ఎక్కువ ఎత్తులో ఎగిరే విమానాల రికార్డులను ధ్రువీకరించే వరల్డ్‌ ఎయిర్‌ స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌ , ఫెడరేషన్‌ ఆఫ్‌ ఏరోనాటికల్‌ ఇంటర్నేషనల్‌ మాత్రం కర్మన్‌ లైన్‌ను 100 కిలోమీటర్లుగా నిర్ధారించాయి.

కాల్గరీ వర్సిటీ పరిశోధకులు 2009లో సుప్రా థర్మల్‌ అయాన్‌ ఇమేజర్‌ అనే పరికరాన్ని రోదసిలోకి పంపి, కర్మన్‌ లైన్‌ ను నిర్ధారించారు. ఆ ప్రకారం రోదసి సరిహద్దు భూమికి 118 కిలోమీటర్ల పైన ఉంది. అయితే, అమెరికా మాత్రం 1960 నుంచి సముద్ర మట్టానికి 80 కిలోమీటర్ల ఎత్తును దాటితే . దాన్ని రోదసిలోకి వెళ్లి వచ్చినట్లుగా నిర్ధారిస్తోంది. ఆ ఎత్తును దాటిన వారిని అమెరికా ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ కూడా అధికారికంగా వ్యోమగాములుగా గుర్తిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వర్జిన్‌ గెలాక్టిక్‌ విజయవంతంగా రోదసికి వెళ్లి వచ్చింది. అభినందనలు అని ట్వీట్‌ చేసింది.

అంతరిక్ష యాత్రలకు సిద్ధమవుతున్న బ్లూ ఆరిజిన్‌ అది రోదసీయానమే కాదంటోంది. వర్జిన్‌ గెలాక్టిక్‌ కు చెందిన యూనిటీ-22 కేవలం 88 కిలోమీటర్ల దూరాన్నే చేరింది. అది రోదసీయానం కాదు. మేము రోదసికి వెళ్లేది ‘న్యూ షెపర్డ్‌’ అనే రాకెట్‌లో. మా స్పేస్‌ షిప్‌ కర్మన్‌ లైన్‌ ను దాటి వెళ్తుంది అని పేర్కొంది. అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌ కూడా బ్లూ ఆరిజిన్‌ వ్యోమగాముల్లో ఒకరు.

వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్ష పరిశోధన సంస్థ నేత్రుత్వంలో 'వీఎస్‌ఎస్ యూనిటీ-22' అనే వ్యోమో నౌక ద్వారా ఈ రోదసియాత్ర జరిగింది . అంతరిక్ష పర్యా‌ట‌కానికి బాటలు వేయాలన్న లక్ష్యం దిశగా ఇది తొలి అడుగు. వర్జిన్‌ గెలాక్టిక్‌ వ్యవస్థాపకుడు రిచర్డ్‌ బ్రాస్‌నన్‌‌తో పాటు మరో నలుగురు ఈ వ్యోమో నౌకలో అంతరిక్షంలోకి ప్రయాణించారు. ఇందులో భారత సంతతి మహిళ శిరీష బండ్ల ఉండటం విశేషం. తెలుగు మూలాలు ఉన్న ఓ మహిళ రోదసిలో అడుగుపెడుతుండటం ఇదే తొలిసారి. గతంలో భారత సంతతి మహిళలు కల్పనా చావ్లా,సునీతా విలియమ్స్ కూడా రోదసీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వీఎంఎస్ ఈవ్ అనే ప్రత్యేక విమానం వ్యోమనౌక వీఎస్‌ఎస్‌ యూనిటీ-22ని భూమి నుంచి 15వేల మీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి విడిచిపెడుతుంది.ఈ వ్యోమోనౌక భూమి నుంచి 88కి.మీ ఎత్తుకు వెళ్ళింది. భవిష్యత్తులో సామాన్య ప్రజలు సైతం అంతరిక్షంలోకి ప్రయాణించేలా... వాణిజ్యపరమైన స్పేస్ సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని రిచర్డ్ బ్రాస్‌నన్ భావిస్తున్నారు. ఆ లక్ష్యంతోనే తన సంస్థ 'వర్జిన్ గెలాక్టిక్' నేత్రుత్వంలో మానవ సహిత అంతరిక్ష రోదసియానానికి శ్రీకారం చుట్టారు.