Begin typing your search above and press return to search.

సీడీ, బ్లాక్‌మెయిల్ చేసేవారికే పదవులు .. సీఎం పై సొంత పార్టీ నేతలే విమర్శలు !

By:  Tupaki Desk   |   15 Jan 2021 8:30 AM GMT
సీడీ,  బ్లాక్‌మెయిల్ చేసేవారికే పదవులు .. సీఎం పై సొంత పార్టీ నేతలే విమర్శలు !
X
కర్ణాటక రాజకీయం ఎప్పుడు హాట్ హాట్ గానే సాగుతుంది. తాజాగా మంత్రి వర్గ విస్తరణ పై పెద్ద చర్చ జరుగుతుంది. ముఖ్యంగా కర్ణాటక సీఎం యడియూరప్పకు , బీజేపీకి పెద్ద తలనొప్పిగా తయారైంది. సొంత పార్టీ నేతల నుంచే అవినీతి, అరాచక ఆరోపణలను సీఎం యడియూరప్ప ఎదుర్కొంటున్నారు. బ్లాక్‌ మెయిర్లకే పదవులు అందుతున్నాయని, వారికే ప్రాధాన్యత ఉందని బీజేపీ ఎమ్మెల్యేలే ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న యడియూరప్ప.. ఏమైనా ఉంటే అధిష్టానానికి ‌ కంప్లైంట్ చేసుకొమ్మని స్పష్టం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలకు ఎలాంటి అభ్యంతరాలున్నా ఢిల్లీకి వెళ్లి జాతీయ నాయకులకు ఫిర్యాదు చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైనా తప్పులు జరుగుతున్నాయని వారు అనుకుంటే వెంటనే హైకమాండ్‌కు తెలియజేయవచ్చు. ఈ విషయంలో నేను ఎలాంటి అభ్యంతరం తెలపను. కానీ నేను వారికి ఒక విషయం స్పష్టం చేయదల్చుకున్నాను. అనారోగ్యకరమైన వ్యాఖ్యల వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుంది అని బెంగళూరులో గురువారం నిర్వహించిన ఓ సమావేశంలో సీఎం యడియూరప్ప అన్నారు.

తాజా మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి వచ్చారు యడియూరప్ప. అనంతరం మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. అయితే గతంలో జరిగిన మంత్రివర్గ విస్తరణ కంటే ఈసారి జరిగిన విస్తరణపై బీజేపీలో పెద్ద ఎత్తున విబేధాలు తలెత్తాయి. సీడీలు చూపించి బ్లాక్‌ మెయిల్ చేసేవారిని, బాగా డబ్బులు ఇచ్చేవారిని, తనకు అత్యంత సన్నిహితులకు మాత్రమే మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. ఇద్దరిని మంత్రులుగా ఒకరిని రాజకీయ కార్యదర్శిగా నియమించారు. వీరు ముగ్గురు సీడీలు చూపించి ఆయనను బెదిరించినవారే. నిజాయితీ, సీనియారిటీ, సామాజికవర్గం, ప్రాంతం లాంటివేవీ పరిగణలోకి తీసుకోకుండా సీడీలు చూపించి బ్లాక్‌ మెయిల్ చేసిన వారికే పదవులు దక్కాయి. నిజాయితీగత సీనియర్ నేతలను యడియూరప్ప పట్టించుకోలేదు. సీడీ తయారు చేసి ప్రభుత్వాన్ని పడగొడతామని బెదిరించిన వారికే మంత్రి పదవులు ఇచ్చారు అని కర్ణాటక బీజేపీకి సీనియర్ లీడర్ అయిన బసనగౌడ ఆర్ పటేల్ అన్నారు.

ఈ వివాదంపై కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ .... బీజేపీ అంటే బ్లాక్‌ మెయిల్ జనతా పార్టీ. సొంత పార్టీ ఎమ్మెల్యేలే సీఎం యడియూరప్పపై బ్లాక్‌ మెయిల్ విమర్శలు చేస్తున్నారు. బీజేపీ నేతల నుంచే ఈ స్థాయిలో విమర్శలు వస్తే, వాస్తవంలో జరిగేది ఏ స్థాయిలో ఉంటుందో, యడియూరప్ప ప్రభుత్వంపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలి. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎజెన్సీ దీనిని సుమోటోగా తీసుకోవాలి అని అన్నారు.