Begin typing your search above and press return to search.

అమరావతి పై ఏపీ బీజేపీ దారెటు?

By:  Tupaki Desk   |   15 Nov 2021 12:30 PM GMT
అమరావతి పై ఏపీ బీజేపీ దారెటు?
X
రాష్ట్ర నాయకులేమో అమరావతే రాజధాని అంటారు.. కేంద్ర నాయకులేమో మౌనంగా ఉండిపోమని ఆదేశాలిస్తారు.. ఇంతకూ అమరావతిపై ఏపీ బీజేపీ దారెటు? అనేది ఇప్పుడు ఏపీ ప్రజలను ఆలోచనలో పడేస్తోంది. ఇంతకూ ఆ పార్టీకి ఓ స్టాండ్ ఉందా? లేదా అని అనుమానం వస్తోంది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఏపీ లోని ఆ ప్రాంత రైతులు ప్రస్తుతం తిరుపతికి పాదయాత్ర చేస్తోన్న సంగతి తెలిసిందే. దీనికి న్యాయ స్థానం నుంచి దేవస్థానం అని పేరు పెట్టారు. ఈ పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందనే వస్తోంది. ముఖ్యంగా యవత ఎక్కువ మద్దతిస్తోంది. రాజధాని విషయంలో అధికార వైసీపీ స్టాండ్ స్పష్టం. మూడు రాజధానులపై వెనక్కు తగ్గేది లేదని చెబుతోంది. కరోనా రాకుంటే కనుక ఈపాటికి ఏదో ఒకటి తేల్చేసేదే. ఇక తెలుగుదేశంది పూర్తి వ్యతిరేక ధోరణి. అమరావతి వారి మానస పుత్రిక. మిగిలింది జనసేన, బీజేపీ. జనసేన కూడా అమరావతి రాజధానికే మద్దతు తెలుపుతోంది. బీజేపీనే ఎటూ తేల్చుకోలేకపోతోంది.

ఎందుకింత గందరగోళం

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కొన్నాళ్ల క్రితం గుంటూరు జిల్లా నేత కన్నా లక్ష్మీనారాయణ వైదొలగడంతో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సోము వీర్రాజుకు అవకాశం దక్కింది. వాస్తవానికి కన్నా రాజధాని ప్రాంతం వారు. ఆ విషయాన్ని వదిలేస్తే బీజేపీ నాయకులెవరూ అమరావతి రాజధానిపై స్పష్టమైన వైఖరితో లేరు. ఓసారి మద్దతు అంటారు.. మరోసారి వెనక్కుపోతారు. ఇంకోసారి బహిరంగ ప్రకటన చేస్తారు. మరోసారి మిన్నకుండిపోతారు. ఇప్పుడు ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించడంలోనూ వారు భిన్న దారుల్లో వెళ్తున్నారు. ఎందుకింత గందరగోళం అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి. క్షేత్రస్థాయిలో జరుగుతున్నది చూస్తుంటే పరిస్థితి ఏమిటో తెలుస్తుంది.

పాదయాత్రకు మద్దతుందా? లేదా?

అమరావతి రైతుల మహా పాదయాత్రలో రైతులు, వివిధ పార్టీల నేతలు, మద్దతుదారులు పాల్గొంటున్నారు. వీరిలో కొందరు బీజేపీ నాయకులూ ఉన్నారనేది టాక్.దీంతో సమస్య మొదలైంది. పాదయాత్రకు వెళ్లొద్దంటూ పార్టీ నేతలను పాల్గొనవద్దని పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్చార్జి సునీల్ దేవధర్ ఫోన్లు చేసి ఆదేశాలు జారీచేస్తున్నట్లు సమాచారం. కానీ, దీనికి భిన్నంగా సోము వీర్రాజు మహా పాదయాత్ర కు మద్దతు పలికారు. అమరావతి ఏకైక రాజధాని డిమాండ్ కు మద్దతు ఇస్తున్నట్లు బహిరంగంగానే ప్రకటించారు. వీర్రాజు ప్రకటనకు తగ్గట్లుగానే జిల్లాల నేతలు కూడా యాత్రలో పాల్గొంటున్నారు. వీరికి ఇప్పుడు దేవధర్ ఫోన్లు చేస్తున్నట్లు సమాచారం. దీంతో తమ పార్టీ అసలు అమరావతికి మద్దతు ఇస్తున్నదా ? వ్యతిరేకమా? అనే సందేహాలు క్యాడర్లో పెరిగిపోతున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడి నిర్ణయానికి స్టేట్ ఇన్చార్జి ఆదేశాలు పూర్తి వ్యతిరేకంగా ఉండటంతో ఎవరి మాట వినాలో నేతలకు అర్ధం కావటం లేదట. అసలు మహాపాదయాత్ర పై పార్టీలో ఎందుకింత గందరగోళం మొదలైందో కూడా నేతలకు తెలియడం లేదు. దేవధర్ ఆదేశాలను పక్కనపెట్టేస్తే పార్టీలో రాజధాని విషయంలో స్పష్టమైన చీలిక కనిపిస్తోంది. ఇక మూడు రాజధానులపై ఉత్తరాంధ్రలోని కొందరు బీజేపీ నేతలు మద్దతుగా మాట్లాడుతున్నది వాస్తవం.

మూడు రాజధానుల విషయం పూర్తిగా రాష్ట్రప్రభుత్వ పరిధిలోనిదే అని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పేసింది. ఇదే నిర్ణయాన్ని అఫిడవిట్ రూపంలో మూడుసార్లు హైకోర్టులో దాఖలు చేసుంది. కాబట్టి రైతుల భూములపై జగన్ ప్రభుత్వం ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందో చూడాలి. మరి ఇంతలోనే మహా పాదయాత్ర విషయంలో బీజేపీలో ఇంత గందరగోళం ఎందుకు మొదలైందో అర్ధం కావటంలేదు.