Begin typing your search above and press return to search.

పాంచ్ ప‌టాక్‌: సినీ గ్లామ‌ర్‌ పై క‌మ‌ల నాథుల టార్గెట్‌!!

By:  Tupaki Desk   |   17 March 2021 2:30 AM GMT
పాంచ్ ప‌టాక్‌:  సినీ గ్లామ‌ర్‌ పై క‌మ‌ల నాథుల టార్గెట్‌!!
X
ఎన్నిక‌ల్లో వ్యూహాలు, ప్ర‌తివ్యూహాలు కామ‌న్‌. అయితే.. ఇప్పుడు మారిన ట్రెండ్‌లో అప్ప‌టిక‌ప్పుడు ఏది అవ‌స‌రం అనుకుంటే.. దానిని ప‌ట్టుకుని ముందుకు సాగ‌డం పార్టీల‌కు ష‌రా మామూలు అన్న‌ట్టుగా మారిపోయింది. నిజానికి కొన్నికొన్ని పార్టీల‌ను తీసుకుంటే.. వాటికి కొన్ని కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. వాటి ప్ర‌కారం ముందుకు సాగుతారు. ఇక‌, కొన్ని కొన్ని పార్టీలు కొంద‌రు నాయ‌కుల‌ను న‌మ్ముకుని ముందుకు సాగుతాయి. కానీ.. ఇప్పుడు బీజేపీ ప‌రిస్థితి మారిపోయిన‌ట్టు తెలుస్తోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ హ‌వాను ప్రొజెక్టు చేస్తూ.. ఏ వేదికెక్కినా.. ఎక్క‌డ ఎన్నికైనా.. మోడీ స్మ‌ర‌ణ‌లో మునిగి తేలే క‌మ‌ల నాథులు రూటు మార్చారు.

ప్ర‌స్తుతం దేశంలోని నాలుగు రాష్ట్రాలు అసోం, కేర‌ళ‌, త‌మిళ‌నాడు, ప‌శ్చిమ బెంగాల్‌ స‌హా పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. అయితే.. ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా.. మోడీ ఫొటో.. ఆయ‌న హ‌వాను నమ్ముకున్న బీజేపీకి ఇప్పుడు పెట్రోల్ ధ‌ర‌లు, నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు.. ఇతర నిర్ణ‌యాలు.. పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ణ వంటివి తీవ్ర‌స్థాయిలో భ‌య‌పెడుతున్నాయి. ఈనేప‌థ్యంలో ఇప్ప‌టి వ‌ర‌కు మోడీని న‌మ్ముకున్న బీజేపీలో ఒక విధ‌మైన గంద‌ర‌గోళ ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీని నుంచి పార్టీని కాపాడుకునేందుకు ల‌క్ష్యంగా పెట్టుకున్న బెంగాల్‌లో అధికారంలోకి వ‌చ్చేందుకు మ‌రో మార్గాన్ని ఎంచుకున్న‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అదే.. సినీ గ్లామ‌ర్‌.

ఈ క్ర‌మంలో ఇప్పుడు బెంగాల్‌లో సినీ తార‌ల‌ను ఆక‌ర్షించే ప‌ని చేప‌ట్టింది బీజేపీ. ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం మ‌మ‌తా బెన‌ర్జీ పార్టీ టీఎంసీకే ప‌రిమిత‌మైన‌.. సినీ గ్లామ‌ర్‌ను త‌న‌వైపు తిప్పుకొనేందుకు శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఎన్నికల వేళ బెంగాల్‌ చిత్ర పరిశ్రమను టోలీవుడ్ ను త‌న‌వైపు తిప్పుకొనే చ‌ర్య‌లు చేప‌ట్టింది. ప్ర‌ముఖ న‌టుడు మిథున్‌ చక్రవర్తిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా బీజేపీకి కొత్త వ్యూహానికి తెర‌దీసింది. అదేవిధంగా యశ్‌దాస్‌ గుప్తా, హిరేన్‌ ఛటర్జీ, రుద్రానిల్ ఘోష్‌, పాయల్‌ సర్కార్‌, స్రవంతి ఛటర్జీ, పాపియా అధికారి .. ఇలా చాలా మందికి బీజేపీ నేత‌లు కండువా క‌ప్పారు. ఇక‌, కొన్నాళ్ల కింద‌టే.. కీల‌క న‌టులు.. రూప గంగూలీ, బాబుల్‌ సుప్రియో, లాకెట్‌ ఛటర్జీలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బుల్లితెర నటీనటులు కూడా బీజేపీకి ప్రచారం చేస్తున్నారు.

ఇక‌, బీజేపీ న‌మ్ముకున్న సినీ గ్లామ‌ర్ కేవ‌లం బెంగాల్‌కే ప‌రిమితం కాలేదు.. కేరళలో కూడా సీనియర్‌ నటుడు సురేశ్‌ గోపీకి టికెట్‌ ఇచ్చింది బీజేపీ. త్రిసూర్‌ నుంచి సురేశ్‌ గోపీ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా తమిళనాడులో ఖుష్బూను ధౌసండ్‌ లైట్స్‌ నియోజకవర్గం నుంచి పోటీకి దింపుతున్నారు. అసోంలో సీని దర్శకురాలు సుమన్‌ హరిప్రియకు టికెట్‌ ఇచ్చింది బీజేపీ. వీరు ఏమేర‌కు రాజ‌కీయాల్లో రాణిస్తారో తెలియ‌దు కానీ.. ఇప్పుడున్న టాక్ మాత్రం బీజేపీలో మోడీ హ‌వా త‌గ్గుతున్న నేప‌థ్యంలోనే ఇలాంటి వ్యూహంతో ముందుకు సాగుతున్నార‌ని.. !!