Begin typing your search above and press return to search.

టార్గెట్ అభిషేక్

By:  Tupaki Desk   |   30 Aug 2021 12:30 PM GMT
టార్గెట్ అభిషేక్
X
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న బీజేపీలోని అగ్రనేతలు అభిషేక్ బెనర్జీ టార్గెట్ గా పావులు కదుపుతున్నట్లే ఉన్నారు. నేరుగా హ్యాట్రిక్ సీఎం మమతా బెనర్జీ ఏమీ చేయలేక ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, ఆయన భార్య రుజిరా బెనర్జీల చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లే ఉంది. సెప్టెంబర్ మొదటివారంలో ఇద్దరిని వేర్వేరు తేదీల్లో విచారణకు హాజరుకావాలంటూ ఎన్ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులివ్వటాన్ని మమత చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు.

తనను నేరుగా ఏమీ చేయలేకే తన మేనల్లుడి కుటుంబాన్ని కేంద్రప్రభుత్వం టార్గెట్ చేస్తోందంటూ దీదీ మండిపోతున్నారు. నిజానికి మమత సీఎం అయినా మొత్తం ప్రభుత్వ, పార్టీ వ్యవహారాలను నడుపుతున్నదంతా అభిషేకే అన్న విషయం అందరికీ తెలిసిందే. అభిషేక్ లేకపోతే మమత లేరన్నంతగా బెంగాల్ రాజకీయాల్లో మేనల్లుడు కీలకమైపోయారు. అందుకనే మమతను వెనుకనుండి నడిపిస్తున్న మేనల్లుడిని దెబ్బ కొట్టడానికి బీజేపీ పెద్దలు డిసైడ్ అయినట్లే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

బొగ్గు గనుల కుంభకోణానికి సంబంధించి మమత లేవనెత్తిన ప్రశ్నలు కూడా కీలకంగా మారాయి. బొగ్గు గనుల కేటాయింపు కేంద్రం పరిధిలోనిది. అంటే బొగ్గు గనుల కేటాయింపులో ఏవైనా అక్రమాలు, అవినీతి జరిగిందంటే ముందుగా కేంద్ర మంత్రి, ఉన్నతాధికారులే బాధ్యత వహించాలి కదా అని మమత కేంద్రాన్ని నిలదీస్తున్నారు. మరి కేంద్రమంత్రిని, ఉన్నతాధికారులను వదిలేసి కేవలం తృణమూల్ ఎంపి అయిన అభిషేక్+భార్యను విచారణకు రమ్మని ఈడీ నోటీసులివ్వటంపైన అనుమానాలు పెరిగిపోతున్నాయి.

బెంగాల్ లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మమత విషయంలో బీజేపీ పెద్దలు కక్ష సాధింపులకు దిగిందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మమత ఆరోపణలు చేసిందనే కాకుండా రాజకీయ పరిణామాలు కూడా అలాగే ఉన్నాయి. మొన్నటి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేయటమే ఆలస్యమన్నట్లుగా ఉన్న బీజేపీని మమత చావుదెబ్బ కొట్టారు. ఓవరాల్ గా చూస్తే ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలే వచ్చినా అధికారం విషయంలో మాత్రం గట్టిదెబ్బ తగిలింది.

మమత కొట్టిన దెబ్బను నరేంద్ర మోడీ, అమిత్ షా తట్టుకోలేకపోతున్నారు. దీన్ని మనసులో ఉంచుకునే తమపై కక్షసాధింపులకు దిగుతున్నట్లుగా మమత చేసిన ఆరోపణలకు మద్దతు పెరుగుతోంది. చివరకు ఈడీ నోటీసులు, విచారణ రాజకీయంగా అనేక మలుపులు తీసుకునేట్లే కనబడుతోంది. చివరకు తాజా పరిణామాలు ఎక్కడకు దారితీస్తాయో చూడాల్సిందే.