Begin typing your search above and press return to search.

బీజేపీ నెక్ట్స్ టార్గెట్ జగన్ మిత్రుడిపైనే

By:  Tupaki Desk   |   20 Feb 2020 12:15 PM GMT
బీజేపీ నెక్ట్స్ టార్గెట్ జగన్ మిత్రుడిపైనే
X
దేశంలో ఆదాయపు శాఖ అధికారుల దాడులు ముమ్మరం అయ్యాయి. ఇటీవల సినిమా రంగానికి చెందిన పలువురి నివాసాల్లో సోదాలు చేయగా.. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు మాజీ పీఏ నివాసంలో చేశారు. ఇప్పుడు మళ్లీ ఐటీ దాడులు పెరుగుతాయని తెలుస్తోంది. బీజేపీ తమకు ఎదురు తిరిగిన వారిపై ఐటీ అస్త్రం ప్రయోగించాలని చూస్తోందని సమాచారం. ఈ క్రమంలో త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ముడిపడిన ఓ వ్యక్తిపై ఐటీ దాడులు జరిగేలా ప్లాన్ సిద్ధమవుతోందంట. సీఏఏపై వ్యతిరేక గళం వినిపిస్తూ ప్రస్తుతం ఏకాకిగా మిగిలిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పై ఐటీ ఫోకస్ పెట్టిందని తెలుస్తోంది.

ఐప్యాక్ సంస్థ ఏర్పాటుచేసి వివిధ రాజకీయ పార్టీలకు వ్యవూలు సిద్ధం చేసి సేవలు అందిస్తున్న సంస్థను ప్రశాంత్ కిశోర్ నెలకొల్పారు. అందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీతోపాటు జగన్ మోహన్ రెడ్డి, నితీశ్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్ తదితరులకు పని చేశారు. ప్రస్తుతం మమత బెనర్జీ, స్టాలిన్ కు సంబంధించిన పార్టీలకు సేవలు అందించేందుకు అంగీకరించాడు. ఆ మేరకు పనులు చేస్తున్నాడు. అయితే ఇటీవల ప్రశాంత్ కిశోర్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడు. సీఏఏ, ఎన్నార్సీ, ఎప్పీఆర్ కు వ్యతిరేకంగా గళం విప్పుతున్నాడు. ఆ క్రమంలోనే తన గురువు, జేడీయూ అధినేత బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పీకేను బహిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు చేయడం తో ఆయన ఈ చర్యలు తీసుకున్నారు.

దీంతో ప్రశాంత్ కిశోర్ ఏ రాజకీయ పార్టీలో లేడు. ఒంటరిగా మిగిలాడు. ఇదే సరైన సమయమని భావించి కేంద్ర ప్రభుత్వం ప్రశాంత్ కిశోర్ ను ఇరుకున పెట్టేలా చర్యలు చేపట్టనున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. ఐప్యాక్ సంస్థ ఏర్పాటుచేసి రాజకీయ పార్టీలకు సేవ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఐప్యాక్ సంస్థ ఆదాయపు పన్ను చెల్లించడం లేదని, ఐప్యాక్ కు చెల్లించిన డబ్బులకు సరిగ్గా ఆధారాలు లేవని గుర్తించారు. చాలామంది ఉద్యోగస్తులకు చెల్లించిన వేతనాలను ఆదాయపు పన్నులో పొందపర్చలేదని సమాచారం తెలిసింది. పైగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు.. నితీశ్ కుమార్ కు దూరమయ్యాడు. దీంతో ప్రశాంత్ కిశోర్ కార్యాలయం, నివాసాలపై ఐటీ దాడులు త్వరలోనే జరిగే అవకాశం కనిపిస్తోంది.

ఆయా పార్టీలకు పని చేసిన సమయంలో డబ్బులు ఎక్కడివి? వాటిని దేనికి ఖర్చు చేశారు? పన్నులు చెల్లించారా? తదితర అంశాలపై ఐటీ దాడులు చేసే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు చేసిన వారిపై ఇటీవల ఐటీ దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల తమిళ నటుడు విజయ్ నివాసంలో ఐటీ సోదాలు చేసింది మనం చూశాం. ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ దొరికాడు. ప్రశాంత్ కిశోర్ పై ఐటీ అస్త్రం ప్రయోగిస్తే సర్వత్రా విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే మమత బెనర్జీ, స్టాలిన్, అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే వారందరికీ ప్రశాంత్ కిశోర్ సేవలందిస్తున్నాడు.