Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ భవన్..గాంధీభవన్ గా మార్చుకోండి..

By:  Tupaki Desk   |   8 Sep 2018 10:46 AM GMT
ఎన్టీఆర్ భవన్..గాంధీభవన్ గా మార్చుకోండి..
X
తెలంగాణలో టీడీపీ - కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడానికి రెడీ అవుతున్న వేళ.. రాష్ట్రంలో సరికొత్త వాతావరణం నెలకొంటోంది. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పురుడు పోసుకున్న టీడీపీని కాంగ్రెస్ తో కలుపుతున్న ఏపీ సీఎం - టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరిపై సాంప్రదాయ టీడీపీ వాదులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ దారుణ పొత్తుపై విమర్శల వాన కురుస్తోంది.

బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్-టీడీపీ పొత్తుతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పేరు మార్చి గాంధీ భవన్ గా మార్చి పెట్టుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబుకు సూచించారు. స్వార్థ రాజకీయాల కోసం తెలుగుదేశం - కాంగ్రెస్ నాయకులు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. సిద్ధాంతం లేని పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీయేనని ఆయన విమర్శించారు. 2019 ఎన్నికల్లో సొంతంగా పోటీచేసే దమ్ముందా అని సూటిగా ప్రశ్నించారు.

ఇక ఏడు సీట్లలో గెలిచే ఎంఐఎం నేత అకర్బుద్దీన్ తాను సీఎం అవుతానని పగటి కలలు కంటున్నారని శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. కర్ణాటకలో అయినట్టు ఇక్కడ 7 సీట్లతో సాధ్యం కాదని ఎద్దేవా చేశారు. టీఆర్ ఎస్ పార్టీ పాముకు పాలు పోసినట్టు ఎంఐఎంను పెంచి పోషిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ ఎస్ కు ఓటేస్తే ఎంఐఎంకు ఓటు వేసినట్టేనని వ్యాఖ్యానించారు.