Begin typing your search above and press return to search.

ఆ ఒక్క‌టి త‌ప్ప‌ గాంధీ, మోడీ సేమ్ టు సేమ్‌

By:  Tupaki Desk   |   2 Jan 2017 10:12 AM GMT
ఆ ఒక్క‌టి త‌ప్ప‌ గాంధీ, మోడీ  సేమ్ టు సేమ్‌
X
పెద్ద నోట్ల ర‌ద్దు విష‌యంలో దేశంలో మెజార్టీ వ‌ర్గాలు ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోడీ తీరును త‌ప్పుప‌డుతుంటే... బీజేపీ నేత‌లు మాత్రం మెచ్చుకుంటున్నారు. ప్ర‌ధాని మోడీనీ మ‌రో మహాత్మా గాంధీలా దేశ ప్రజలు చూస్తున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ పేర్కొన్నారు. పేదల ఇళ్ళల్లో ప్రధాని వెలుగులు నింపుతున్నారని ఆయన పేర్కొన్నారు. 1917 సంవత్సరంలో మహాత్మా గాంధీ నాటి తెల్ల దొరలకు వ్యతిరేకంగా సత్యాగ్రహం చేపట్టారని, చాలా సాదాసీదాగా గోచి మాత్రమే ధరించారని డాక్టర్ లక్ష్మణ్ గుర్తు చేశారు. నేడు ప్రధాని నరేంద్ర మోడీ మహాత్ముని బాటలో నల్ల కుబేరులకు వ్యతిరేకంగా చేపట్టిన పెద్ద నోట్ల రద్దుతో విప్లవం రాబోతున్నదని అన్నారు. నల్ల కుబేరుల గుండెలు గుభేలుమన్నాయని ల‌క్ష్మ‌ణ్‌ తెలిపారు.

పెద్ద నోట్లను రద్దు చేసిన 50 రోజుల తర్వాత ప్రధాని జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పేద - మధ్య తరగతి ప్రజల కోసం వరాలు కురిపించారని ల‌క్ష్మ‌ణ్ అన్నారు. ఇళ్ల నిర్మాణపథకంలో అదనంగా 33 శాతం ఇళ్లు నిర్మించనున్నట్లు హామీ ఇచ్చారని ఆయన వివరించారు. వ్యవసాయం - గృహా నిర్మాణం - నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించారని వెల్ల‌డించారు. ఐదు లక్షల పేద (బిపిఎల్) కుటుంబాలకు ఉచిత విద్యుత్తు సరఫరా, చిరు వ్యాపారులకు ఏడున్నర లక్షల డిపాజిట్లు అందుబాటులోకి తెచ్చారని ల‌క్ష్మ‌ణ్‌ తెలిపారు. ఇవ‌న్నీ పేద‌ల్లో త‌మ కోసం వ‌చ్చిన గాంధీ అనే భావ‌న‌కు కార‌ణంగా మారాయ‌ని తెలిపారు. ప్రతిపక్షాలు పనిగట్టుకుని విమర్శలు చేయడం భావ్యం కాదని, దేశ హితం కోసం ప్రభుత్వానికి సహకరించాలని ల‌క్ష్మ‌ణ్‌ కోరారు. కాగా.. రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాలని డాక్టర్ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఒక ట్రస్టీగా నిలబడి నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని ఆయన కోరారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/