Begin typing your search above and press return to search.

జై పరశురాం... టోన్ మార్చిన బీజేపీ... ?

By:  Tupaki Desk   |   11 Jan 2022 8:31 AM GMT
జై పరశురాం... టోన్ మార్చిన బీజేపీ... ?
X
బీజేపీ అంటేనే రాముడు పార్టీ అని మూడు దశాబ్దాలుగా దేశ జనాలు గుర్తు పెట్టుకుంటూ వస్తున్నారు. నిజానికి రాముడు అందరివాడు. కానీ తమ వాడు అంటూ కాషాయ పార్టీ లాగేసుకుంది. రాముడి గుడి పేరిట చేసిన రాజకీయంతో బీజేపీ బాగా లాభపడింది. అప్పటిదాకా మైనారిటీల‌ ఓట్లతోనే ఎవరైనా అధికారంలోకి వచ్చేవారు. అది తప్పు అంటూ మెజారిటీలను ముగ్గులోకి దించి మరీ బీజేపీ దేశ రాజకీయాల‌నే సమూలంగా మార్చేసింది.

ఇదిలా ఉండగా ఇపుడు అయోధ్య వివాదం పూర్తిగా సద్దుమణగింది. భవ్యమైన రామమందిరం 2023 నాటికి రెడీ అవుతుంది. అయితే బీజేపీ రాజకీయ అవసరాలు మాత్రం అలాగే ఉన్నాయి. ప్రస్తుతం యూపీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలవడం బీజేపీకి చాలా ముఖ్యం. అక్కడ గెలిస్తేనే దేశంలో మూడవసారి మోడీ మళ్లీ ప్రధాని అయ్యేది. దాంతో చాలా ప్రతిష్టగా ఈ ఎన్నికలను బీజేపీ తీసుకుంటోంది.

దాంతో తాజా యూపీ ఎన్నికల్లో అనేక చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. జై శ్రీరాం అని అనేక ఎన్నికల్లో ఓట్లను ఒడిసి పట్టుకున్న బీజేపీ ఇపుడు జై పరశురాం అంటోంది. మరి పరశురాముడు అర్జంటుగా మధ్యలోకి ఎలా వచ్చాడు. ఆయన‌కు ఉన్న పొలిటికల్ ఇంపార్టెన్స్ ఏంటి అన్నది చూడాల్సిందే. యూపీలో బ్రాహ్మణులు 12 శాతం దాకా ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే వీరి సంఖ్య ఏకంగా ఇరవై శాతం పైగా ఉంది. అంటే అభ్యర్ధుల గెలుపును వారే నిర్ణయిస్తారు అన్న మాట.

గత ఎన్నికల్లో వీరంగా బీజేపీకే మద్దతుగా నిలవడంతో నాలుగింట మూడు వంతుల మెజారిటీని బీజేపీ సంపాదించుకుంది. అయితే యోగీ ఆదిత్యనాధ్ ఏలుబడిలో తమకు న్యాయం జరగడంలేదని భావించిన బ్రాహ్మణులు మెల్లగా సమాజ్ వాది పార్టీ వైపు మొగ్గు చూపారు. ఇపుడు వారే అక్కడ కీలకంగా ఉన్నారు. దాంతో బ్రాహ్మణ ఓట్లను తిరిగి తెచ్చుకోవడానికి బీజేపీ వేసిన కొత్త ఎత్తుగడే జై పరశురాం.

మన పురాణాల్లో చూసుకుంటే కోపిష్టిగా పేరున్న పరశురాముడు బ్రాహ్మణుడు. మత ప్రభావం అధికంగా ఉండే యూపీలో ఆయన గురించి తెలియని వారు లేరు. అయితే ఆయనకు గుళ్ళూ గోపురాలు తక్కువ. ఇపుడు ఆ పనిలో బీజేపీ బిజీగా ఉంది. లేటెస్ట్ గా యూపీలో 12 అడుగుల పరశురాముడి విగ్రహాన్ని ప్రతిష్టించి మరీ తన భక్తిని చాటుకుంది. తాము పరశురాముడి ప్రాశస్థ్యాన్ని మరింతగా జనాల్లోకి తీసుకెళ్తామని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అంతే కాదు ఆయనకు గుడులు కట్టించి మరింతగా కీర్తిని తెస్తామని అంటున్నారు.

ఇదంతా ఓట్ల భక్తిగా ఎస్పీ సహా ఇతర ప్రతిపక్షాలు కొట్టిపారేస్తున్నారు. అధికారంలో ఉన్నపుడు కనీసం బ్రాహ్మణులను పట్టించుకోలేదని, వారికి సరైన మంత్రి పదవులు కూడా ఇవ్వలేదని, ఇపుడు ఎన్నికల వేళ జై పరశురాం అంటే మురిసి మద్దతు ఇచ్చేవారు ఎవరూ లేరు అని ఎస్పీ నేతలు అంటున్నారు. తాము వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెబుతున్నారు. ఇదిలా ఉంటే బ్రాహణుల ఓట్లు గంపగుత్తగా పడకపోయినా కొంచెం చీలిక తెచ్చినా కూడా తాము ఒడ్డెక్కేస్తామని బీజేపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. మరి ఇది ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.