Begin typing your search above and press return to search.

శశికళ ను పార్టీలో చేర్చుకోండి అంటూ బీజేపీ ఒత్తిడి...బీజేపీ వ్యూహం ఇదే !

By:  Tupaki Desk   |   3 March 2021 12:23 PM GMT
శశికళ ను పార్టీలో చేర్చుకోండి అంటూ బీజేపీ ఒత్తిడి...బీజేపీ వ్యూహం ఇదే !
X
వీకే శశికళ .. అలియాస్ చిన్నమ్మ. ఇటీవలే జైలు జీవితానికి స్వస్తి పలికి చెన్నై కి రీఎంట్రీ ఇచ్చారు. అయితే , రీఎంట్రీ అయితే గ్రాండ్ గా ఇచ్చారు కానీ , ఆ తర్వాత ఆమె చేసే ఏ ప్రయత్నం కూడా అంతగా ఫలించడం లేదు. అన్నాడీఎంకే లో మళ్లీ తన చేతుల్లోకి తీసుకోవడానికి ఎన్ని వ్యూహాలు వేస్తున్నా కూడా ఏదీ వర్కౌట్ కావడంలేదు. అయితే , ఈ ఎన్నికల్లో ఎలాగైనా తమిళనాడు లో బీజేపీ జెండా ఎగురవేయాలని ఆశ పడుతున్న కమల నాథులు అధికార అన్నాడీఎంకే తో పొత్తు తో ఎన్నికల బరిలో నిలవబోతున్నారు. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల అయింది. అయితే, ఈ సారి తమిళనాడు ఎన్నికల్లో అధికారం కోసం చాలామంది పోటీ పడుతుండటంతో అధికారం ఎవరిదో చెప్పడం ఎవరికీ సాధ్యం కావడంలేదు.

ఈ నేపథ్యంలో తమిళనాడు లో ప్రధాన ప్రతిపక్షం స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే పార్టీని ఎదుర్కొనేందుకు ప్రస్తుత సీఎం ఎడప్పాడి పళనిస్వామి , ఉపముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం చరిష్మా మాత్రమే సరిపోదని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారికి అండగా ఉండేందుకు దివంగత జయలలిత సన్నిహితురాలైన వీకే శశికళను అన్నాడీఎంకేలోకి చేర్చేందుకు కమల నాథులు గట్టి ప్రయత్నాలు ప్రారంభించినట్టు ఓ ప్రచారం అయితే జరుగుతోంది. శశికళను చేర్చుకునేలా ఈపీఎస్‌, ఓపీఎస్ లపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. అయితే, బీజేపీ ప్రతిపాదనకు పన్నీరు సెల్వం సుముఖత వ్యక్తం చేయగా, పళనిస్వామి మాత్రం విముఖత ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది.

ఏప్రిల్‌ 6న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్న అన్నాడీఎంకే, బీజేపీల మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ తమిళనాడు ఎన్నికల ఇన్‌చార్జ్‌లుగా ఉన్న కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, వీకే సింగ్‌, బీజేపీ రాష్ట్ర ఇన్ ‌చార్జ్‌ లుగా ఉన్న సీటీ రవి, పొంగులేటి సుధాకర్‌ రెడ్డి తో ఈపీఎస్‌, ఓపీఎస్‌ చర్చించారు. రెండు రోజుల కిందట కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతోనూ వారిద్దరూ కలిసి చెన్నైలో చర్చించారు. ఈ సందర్భంగా షా కూడా శశికళను పార్టీలో చేర్చుకోవాలని, తద్వారా అన్నాడీఎంకే మరింత బలోపేతమవుతుందని చెప్పినట్లు తెలిసింది. అయినప్పటికీ.. ఈపీఎస్‌ విముఖత చూపినట్లు సమాచారం. అన్నాడీఎంకేలో సుమారు సగం మంది నాయకులు శశికళను పార్టీలో చేర్చుకోవాలని కోరుకుంటున్నారు. అయితే, శశికళను కనుక చేర్చుకుంటే పార్టీలో గ్రూపులు ఏర్పడతాయని, పార్టీ తన చేతుల్లోంచి జారిపోతుందని పళని స్వామి ఆందోళన చెందుతున్నట్టు స్పష్టమవుతోంది. ఈ విషయాన్ని ఆయన అమిత్‌షా వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. కానీ, డీఎంకేను ఎదుర్కొనేందుకు ప్రస్తుతమున్న బలం సరిపోదని అమిత్‌షా కుండబద్దలు కొట్టినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే ఆ భేటీ ముగిసినట్టు సమాచారం. అయితే , శశికళ ను మళ్లీ అన్నాడీఎంకే లోకి తీసుకురావడానికి , తద్వారా అక్కడ అధికారంలోకి రావడానికి బీజేపీ గట్టిగానే ప్రయత్నం చేస్తునట్టు ప్రచారం జరుగుతుంది.