Begin typing your search above and press return to search.

పాతబస్తిలో భాజపాకు భంగపాటు తప్పదా....?

By:  Tupaki Desk   |   13 Aug 2018 6:22 AM GMT
పాతబస్తిలో భాజపాకు భంగపాటు తప్పదా....?
X
హైదారబాదులోని పాతబస్తీలో పాగా వేయలన్నది భారతీయ జనతా పార్టీ కల. ముఖ‌్యంగా హైదారబాద్ లోక్‌ సభ స్థానాన్ని మజ్లీస్ పార్టీనుంచి దూరం చేయాలని ఆశ. అయితే దశాబ్దాలు గడుస్తున్నా భారతీయ జనతా పార్టీ కల నెరవేరలేదు. గతంలో పాతబస్తీ టైగర్ గా పిలిచే ఆలే నరేంద్ర ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీకి పాత బస్తీలో కాస్త పట్టుండేది. ఆయనతో పాటు బద్దం బాల్‌రెడ్డి కూడా మజ్లీస్ పార్టీని నియంత్రించేందుకు గట్టి ప్రయాత్నాలే చేసేవారు. అయితే సమైక్య రాష్ట్రంలో బిజేపికి హైదారబాద్ ఆయువుపట్టు. ఇక్కడ గెలిచిన నాయకులకు జాతీయ స్దాయిలో మంచి గుర్తింపు ఉండేది. దీంతో పాత బస్తీలో గెలుపు కోసం స్థానిక నేతలు శ్రమించేవారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో అత్యున్నత పదవిలో ఉన్న ఓ నాయకుని రాజకీయాల కారణంగా నరేంద్ర - బద్దం బాల్‌ రెడ్డి పార్టీకి దూరమవుతూ వచ్చారు. ఇలాంటి సమయంలో తిరిగి పునర్వైభవం కోసం పార్టీ అధ్యక్షుడు అమిత్ షా వ్యూహ రచన చేస్తున్నారు. అందులో భాగంగా గోషామహల్ ఎమ్మేల్యే రాజాసింగ్‌ ను హైదారబాద్ నుంచి లోక్‌ సభకు పోటీ చేయించాలనుకున్నారు. ఇదే విషయమై రాజాసింగ్‌ తో చర్చలు కూడా జరిపినట్లు వార్తలొచ్చాయి. ఇలాంటి కీలక సమయంలో రాజాసింగ్ తన ఎమ్మేల్యే పదవికి - పార్టీ సభ్యత్వానికి రాజీనామ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదీ భారతీయ జనతా పార్టీకి ఊహించని షాక్.

పాతబస్తీలో రాజాసింగ్‌ కు సొంత కేడర్ ఉంది. అలాగే బంధుగణం కూడా చాల పెద్దది. అక్కడ మజ్టీస్ పార్టీని ఎదుర్కొనే సత్తా ఆయనకే ఉంది. దీంతో రాజాసింగ్ ను హైదారబాద్ ఎన్నికలో బరిలో దింపి దశాబ్దాల కలను నెరవేర్చుకోవాలని బిజేపీ అధినాయకత్వం ఆశించింది. కాని రాజాసింగ్ మాత్రం స్దానిక భారతీయ జనతా పార్టీ నాయకులతో వచ్చిన విభేదాల కారణంగా పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఇంతకు ముందు నగర పర్యటనకు వచ్చిన అమిత్ షా రాజసింగ్‌ తో చర్చలు జరిపారు. పార్టీలో విభేదాలను విడనాడి కలసి పనిచేయాలని హితవు పలికారు ఆయన సమక్షంలో తలవూపిన నాయకులు ఆ తర్వాత ఎవరికివారే యమునా తీరే అన్న చందంగా మారిపోయారు. దీంతో రాజాసింగ్ పార్టీని వీడేందుకు నిర్ణయించుకున్నారు. ఇదీ భారతీయ జనతా పార్టీకి తీరని నష్టం చేకూరుస్తుందని పరిశీలకులు అంటున్నారు.