Begin typing your search above and press return to search.

వంద మంది తాంత్రికుల‌తో మోడీ బ్యాచ్‌

By:  Tupaki Desk   |   12 Jun 2017 7:38 AM GMT
వంద మంది తాంత్రికుల‌తో మోడీ బ్యాచ్‌
X
రాజ‌కీయాల్లో ఉన్న‌ప్పుడు అన్ని కార్య‌క్ర‌మాల‌కు హాజరు కావాల్సిందే. కానీ.. కొన్నింటికి దూరంగా ఉండ‌టం చాలా అవ‌స‌రం. కానీ.. అలాంటి విష‌యాల్ని ప‌ట్టించుకోని రాజ‌కీయ‌నేత‌లు లేనిపోని వివాదాల్లోకి ఇరుక్కుపోతుంటారు. తాజాగా మోడీ సొంత అడ్డా అయిన గుజ‌రాత్ లో బీజేపీ మంత్రులు ఇప్పుడో వివాదంలో ఇరుక్కుపోయారు.

అహ్మ‌దాబాద్ లోని బోటాడ్ జిల్లాలో ఆదివారం ఒక ఆల‌యంలో తాంత్రికుల‌కు స‌న్మాన కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశారు. దీనికి గుజ‌రాత్ కు చెందిన ఇద్ద‌రు మంత్రుల (భూపేంద్ర సింగ్‌.. ఆత్మారాం పార్మ‌ర్‌)ను అతిధులుగా ఆహ్వానించారు. ఈ కార్య‌క్ర‌మంలో తాంత్రికులు చేసిన చేష్ట‌ల‌కు మంత్రుల స్పంద‌న‌లు వివాదాస్పదంగా మారాయి.

సంగీతం పెట్టుకొని.. ఇద్ద‌రు తాంత్రికులు గొలుసుల‌తో కొట్టుకుంటూ ఉండ‌గా.. వారిని చూసి ఇద్ద‌రు మంత్రులు అభినందించిన వైనం ఇప్పుడు వివాదంగా మారింది. అంతేకాదు.. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన వంద మంది తాంత్రికుల‌కు షేక్ హ్యాండ్ ఇవ్వ‌టం ఇప్పుడు త‌ప్పు ప‌డుతున్నారు. తాంత్రికుల్ని అలా ఎలా అభినందిస్తారంటూ ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

తాంత్రికులు ఏర్పాటు చేసే కార్యక్ర‌మాల‌కు వెళ్ల‌టం.. వారితో రాసుకుపూసుకు తిర‌గ‌టాన్ని త‌ప్పు ప‌డుతున్న ప‌లువురు.. వారిపై వేటు వేయాలంటూ గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి విజ‌య్ రూపానీని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాము దైవ‌శ‌క్తిని న‌మ్మే భ‌క్తుల కార్య‌క్ర‌మానికి మాత్ర‌మే వెళ్లామ‌ని.. త‌మ‌పై చేస్తున్న విమ‌ర్శ‌ల్లో అర్థం లేద‌ని వారు చెబుతున్నారు. మ‌రీ.. వివాదం ఎక్క‌డి వ‌ర‌కూ వెళుతుందన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/