Begin typing your search above and press return to search.

గుజరాత్ ఫ‌లితాల్లో లో ఇది ఖ‌చ్చితంగా ట్విస్ట్‌

By:  Tupaki Desk   |   19 Dec 2017 5:43 AM GMT
గుజరాత్ ఫ‌లితాల్లో లో ఇది ఖ‌చ్చితంగా ట్విస్ట్‌
X
గుజరాత్ లో ఊహించిన ఫలితాలే వచ్చాయి. ప్రధాని మోడీ నేతృత్వంలోని కాషాయదళం 99 స్థానాల్లో గెలిచి సాధారణ మెజారిటీ కన్నా ఒక మెట్టు పైన నిలిచింది. గుజరాత్ లో వరుసగా ఆరోసారి బీజేపీ స్పష్టమైన మెజార్టీతో అధికారం చేపడుతోంది. మొదట ఫలితాలు బీజేపీ - కాంగ్రెస్ ల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగాయి. ఐతే చివరికి బీజేపీ పైచేయి సాధించింది. మొత్తం 182 స్థానాలకు గాను బీజేపీ 99 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్‌ 80 స్థానాల్లో గెలిచింది. అయితే...గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ వరుసగా మరోసారి విజయం సాధించినా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పట్టుకోల్పోయింది.

పట్టణాలతో పాటు - పట్టణశివారులోని ప్రాంతాల్లో బీజేపీ చాలా సీట్లు గెలుచుకున్నా గ్రామాలలో అంతగా రాణించలేకపోయింది. పల్లెటూళ్లలో కాంగ్రెస్ తిరిగి బలం పుంజుకుంది. గుజరాత్‌ లోని 73 పట్టణ ప్రాంత నియోజకవర్గాల్లో దాదాపు మూడింట రెండు వంతు నియోజకవర్గాలను బీజేపీ - ఒక వంతు నియోజకవర్గాలను కాంగ్రెస్ గెలుచుకున్నాయి. ప్రధాని మోడీ ముమ్మర ప్రచారం నిర్వహించిన పట్టణ ప్రాంత నియోజకవర్గాల్లోని జామ్‌ నగర్ నార్త్ - రాజ్‌ కోట్ సౌత్ - రాజ్‌ కోట్ ఈస్ట్ - మెహ్మెదాబాద్ - హిమ్మత్ నగర్ - సనంద్ నియోజకవర్గాలను ఈసారి కాంగ్రెస్ నుంచి జీజేపీ చేజిక్కించుకుంది. పట్టణ శివారు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్‌ ను బీజేపీ ఓడించింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కమలం పార్టీ ఈ హవాను కొనసాగించలేకపోయింది.

పట్టణాల ధోరణికి భిన్నంగా గ్రామాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటు వేశాయి. గ్రామీణ ప్రాంతాల్లోని 109 నియోజకవర్గాల్లో 60 శాతానికిపైగా సీట్లు హస్తం పార్టీ గెలుచుకుంది. అందులో 23 చోట్ల బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఓడించడం విశేషం. గ్రామీణ ప్రాంతాల్లో మరో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను ఇండిపెండెంట్లు ఓడించారు. ఇక పాటిదార్ల ఓట్లు తమకే పడుతాయని రెండు ప్రధాన పార్టీలు అనుకున్నా, ఆ వర్గం వారు కూడా పట్టణాల్లో బీజేపీకి, పల్లెల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారు. నార్త్ గుజరాత్ - సౌరాష్ట్ర - కచ్ ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ తన బలాన్ని పెంచుకుంది.