Begin typing your search above and press return to search.

హుజూరాబాద్ ప్రచారంలో వాళ్లు ఏరి?

By:  Tupaki Desk   |   25 Oct 2021 7:25 AM GMT
హుజూరాబాద్ ప్రచారంలో వాళ్లు ఏరి?
X
మరి కొద్ది రోజుల్లో హూజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీలు ప్రచారాన్ని జోరు పెంచాయి. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తీరిక లేకుండా ప్రచారం చేస్తూ రాజకీయ ఊపును తెచ్చారు. బీజేపీ తరుపున పోటీ చేస్తున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రచారానికి మద్దతుగా బీజేపీ రాష్ట్ర నాయకులు హుజూరాబాద్లోనే మకాం వేశారు. పార్టీ రాష్ట్ర నాయకుడితో పాటు ఎమ్మెల్యేలు,ఎంపీలు ఈటలకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. అధికార పార్టీ ఓటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మాటల తూటాలు పేలుస్తున్నారు. అయితే బీజేపీలో ఇద్దరు నేతలు మాత్రం ఇప్పటికీ హుజూరాబాద్లో అడుగుపెట్టలేదు. కనీసం ఒక్కసారి కూడా ప్రచారం చేయలేదు. మరి ఆ నేతలు ఈటలకు మద్దతు ఇవ్వకపోవడంపై కారణమేంటన్న ప్రశ్న అందరిలో మెదులుతోంది.

రాష్ట్రంలో బీజేపీ తరుపున ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకరు రాజాసింగ్, మరొకరు రఘునందన్ రావు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజాసింగ్ గెలవగా... ఉప ఎన్నిక ద్వారా రఘునందన్ రావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయంలో రఘునందన్ రావు మొదటి నుంచి ఇక్కడ పర్యటిస్తున్నారు. మధ్య మధ్యలో సమావేశాలు నిర్వహిస్తూ ఈటలకు మద్దతుగా మాట్లాడుతున్నారు. కానీ రాజా సింగ్ మాత్రం హుజూరాబాద్ విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ తరుపున జోరుగా ప్రచారం చేసిన రాజా సింగ్ హుజూరాబాద్ ఎన్నికల్లో మాత్రం ఆయన ఆనవాళ్లు కనిపించడం లేదు.

బీజేపీ స్టార్ క్యాంపెయిన్లను ప్రకటించిన జాబితాలో రాజాసింగ్ పేరు లేదు. పార్టీలో నామినేటేడ్ పోస్టుల్లో ఉన్నవారి పేరు చేర్చిన అధిష్టానం ఆయన పేరును మాత్రం ప్రస్తావించలేదు. దీంతో ఆయన ను ఎందుకు దూరం పెట్టారోనన్న చర్చ సాగుతోంది. అయితే కొందరి వాదన ప్రకారం ఆయన చేసే ప్రసంగాలే రాష్ గా ఉన్నందువల్ల ఆయనను హుజూరాబాద్ లో దించనట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ కు పార్టీ తరుపున కాకుండా వ్యక్తిగతంగా అన్ని వర్గాల్లో ఎంతో కొంత మద్దతు ఉంది. ఈ నేపథ్యంలో రాజా సింగ్ లాంటి వ్యాఖ్యలతో ముస్లిం వర్గాలు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకు ఇక్కడ అవకాశం ఇవ్వలేదని తెలుస్తోంది.

ఇక పార్టీలో మరో సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి సైతం హుజూరాబాద్లో కనిపించడం లేదు. పార్టీకి ఒకప్పడు అధ్యక్షుడిగా ఉన్న ఇంద్రసేనారెడ్డి హుజూరాబాద్లో మొదటి నుంచి ఆయన ప్రస్తావన లేకపోవడం గమనార్హం. అయితే దుబ్బాక ఎన్నిక సమయంలో ఆ ప్రక్రియనంతా తానే చూసుకున్న ఆయన హుజూరాబాద్ విషయంలో మాత్రం ఇంట్రస్టు చూపడం లేదట. అయితే ఇంద్రసేనారెడ్డిని ఎవరూ వద్దనకపోయినా కొన్ని విషయాల్లో అలక వహించినట్లు తెలుస్తోంది. దీంతో హుజూరాబాద్ ఎన్నికకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఉప ఎన్నిక తరువాతనైనా ఈయన అలక వీడుతారా..? లేదా..? అన్నది చూడాలి.

ఇక నియోజకవర్గంలో బీజేపీ నాయకులు ప్రచారాన్ని జోరు పెంచారు. మాటల తూటాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓ వైపు ఈటల వ్యక్తిగత మద్దతు పాటు కేంద్రంలో మోడీ ప్రవేశపెడుతున్న పథకాలను ప్రచారం చేస్తున్నారు. ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రఘనందన్ రావు తలో మండలంలో పర్యటిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ప్రచారానికి మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉండడంతో ప్రసంగాల వేడి పెంచారు. ఓ వైపు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రోడ్ షో లు చేస్తూనే సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఈటల సైతం ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ తనను గెలిపించాలని కోరుతున్నారు.