Begin typing your search above and press return to search.

బీజేపీ నేత‌ల‌కు నితిన్‌కి, నిఖిల్‌కు కూడా తేడా తెలియ‌దా?

By:  Tupaki Desk   |   7 Sep 2022 4:37 AM GMT
బీజేపీ నేత‌ల‌కు నితిన్‌కి, నిఖిల్‌కు కూడా తేడా తెలియ‌దా?
X
డామిట్.. క‌థ అడ్డం తిరిగింది.. అని ఒక సామెత‌. ఇప్పుడు అచ్చం బీజేపీ నేత‌ల‌కు ఇదే వ‌ర్తిస్తుంద‌ని చెప్పుకుంటున్నారు. బీజేపీ అధిష్టానం వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోమారు విజ‌యం సాధించ‌డానికి సినిమా తార‌ల‌ను త‌మ పార్టీలోకి ఆహ్వానిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలోనే కేర‌ళ నుంచి ప్ర‌ముఖ న‌టుడు సురేష్ గోపి, త‌మిళ‌నాడు నుంచి సంగీత ద‌ర్శ‌కుడు ఇళ‌య‌రాజా, తెలుగు రాష్ట్రాల నుంచి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌ల‌ను రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేసింది. ఇక నార్త్ ఇండియాలో ఒక‌ప్ప‌టి అందాల తార‌ హేమ‌మాలిని, ర‌వి కిష‌న్ (అల్లు అర్జున్ రేసు గుర్రం సినిమా విల‌న్‌) త‌దిత‌రులు ఇప్ప‌టికే లోక్‌స‌భ ఎంపీలుగా ఉన్నారు.

2023లో తెలంగాణ అసెంబ్లీకి, 2024లో ఏపీ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ రెండు రాష్ట్రాల‌పై బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. ఇందులో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ప్ర‌ముఖ న‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో హైద‌రాబాద్‌లో భేటీ అయ్యారు. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ న‌డ్డా కూడా ప్ర‌ముఖ న‌టుడు నితిన్‌తో స‌మావేశ‌మ‌య్యారు.

కాగా జేపీ న‌డ్డా క‌ల‌వాల‌ని అనుకుంది.. నితిన్ కాద‌ని నిఖిల్ అని చెబుతున్నారు. ఇటీవ‌ల నిఖిల్ హీరోగా న‌టించిన కార్తికేయ-2 అఖండ విజ‌యం సాధించింది. టాలీవుడ్‌లోనే కాక బాలీవుడ్ లోనూ ఈ సినిమా దుమ్మురేపింది. రూ.100 కోట్ల క‌లెక్ష‌న్ల‌ను కొల్ల‌గొట్టింది. ముఖ్యంగా కృష్ణుడిపై భ‌క్తి, కృష్ణ త‌త్వాన్ని ఈ సినిమా చ‌క్క‌గా ఆవిష్క‌రించింది. దీంతో ఈ సినిమా న‌టీన‌టుల‌కు దేశ‌వ్యాప్తంగా మంచి పేరు ప్ర‌తిష్ట‌లు వ‌చ్చాయి. అందులోనూ కార్తికేయ‌-2లో బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు, బీజేపీ సానుభూతిప‌రుడు అనుప‌మ్ ఖేర్ కూడా ప్ర‌ముఖ పాత్ర పోషించారు. ఈయ‌న భార్య కిర‌ణ్ ఖేర్ బీజేపీ ఎంపీగా ఉన్నారు.

ఈ నేప‌థ్యంలో కార్తికేయ‌-2 హీరో నిఖిల్‌ను బీజేపీలో చేరాల‌ని ఆహ్వానించ‌డం లేదా బీజేపీకి ప్ర‌చారం చేయాల‌ని కోరాల‌ని ఆ పార్టీ అధిష్టానం నిర్ణ‌యించుకుంది. అయితే ఇది ఎవ‌రి పొర‌పాటో కానీ నిఖిల్ బ‌దులుగా నితిన్ కార్తికేయ‌-2 హీరో అని అత‌డిని పిలిచారు. వాస్త‌వానికి ఇటీవ‌ల కాలంలో నితిన్ కు హిట్లు లేవు. ఇటీవ‌ల విడుద‌లైన మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం మూవీ డిజాస్ట‌ర్ గా నిలిచింది. దీంతో స‌హ‌జంగానే నితిన్‌ను బీజేపీ పెద్ద‌లు పిలిచిన‌ప్పుడు అంతా ఆశ్చ‌ర్య‌పోయారు.

దీంతో అసలు నితిన్ ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎందుకు కలిశారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే నిజానికి నడ్డా కలవాలనుకున్నది నితిన్ ని కాదట. ఆయన నిఖిల్ ని కలవాలనుకుంటే తెలంగాణ బీజేపీ నాయకులు నితిన్ ని తీసుకొచ్చి ఆయన ముందు కూర్చోబెట్టారని ప్ర‌స్తుతం ప్ర‌చారం జ‌రుగుతుండటం విశేషం.

నిఖిల్ హీరోగా నటించిన 'కార్తికేయ-2'లో పురాణాలు మన చరిత్ర అని చెబుతూ శ్రీ కృష్ణ తత్వం గురించి వివరించిన తీరు అంద‌రినీ ఆకట్టుకుంది. అందుకే హీరో నిఖిల్ ని నడ్డా ప్రత్యేకంగా అభినందించాల‌ని అనుకున్నారట. అయితే నితిన్, నిఖిల్ పేర్లు రెండూ ఒకేలా ఉండ‌టంతో నిఖిల్‌కు బ‌దులుగా నితిన్‌ను పిలిచార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.