Begin typing your search above and press return to search.

కేసీఆర్ సీఎం ఎలా అయ్యారో తెలిసింది

By:  Tupaki Desk   |   1 Nov 2016 5:52 AM GMT
కేసీఆర్ సీఎం ఎలా అయ్యారో తెలిసింది
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పై ప్ర‌తిప‌క్ష బీజేపీ ఘాటు విమ‌ర్శ‌లు చేసింది. సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా అసెంబ్లీ సమీపంలోని సర్దార్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్య్రం లభించడానికి సర్దార్ పటేల్ శక్తియుక్తులే కారణమని గుర్తుచేశారు. సర్దార్ వల్లభాయి పటేల్ లేకుంటే తెలంగాణ లేదని పేర్కొన్నారు. తెలంగాణ లేకుంటే సీఎంగా కే చంద్రశేఖరరావుకు అవకాశం వచ్చేది కాదని వ్యాఖ్యానించారు.

రాష్ట్రీయ ఏక్తా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించాలని కేంద్రం సూచించినా, టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదని లక్ష్మణ్ మండిప‌డ్డారు. అన్ని పార్టీలూ పటేల్ జయంతిని నిర్వహిస్తున్నా - టీఆర్‌ ఎస్‌ కు మాత్రం పట్టింపు లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఓట్ల రాజకీయాలకు స్వాతంత్య్ర ఉత్సవాలు జరపకపోవడం తెలంగాణకు చేస్తున్న ద్రోహమేనని అంటూ, ఆనాటి పోరాట యోధులను అవమానపర్చడమేనని ల‌క్ష్మ‌ణ్ విమర్శించారు. కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ సర్దార్ పటేల్ అకుంటిత దీక్షతో దేశంలోని 500కుపైగా సంస్థానాలను విలీనం చేశారని, ఆయన సరైన చర్య తీసుకోకపోయుంటే నిజాం నవాబు లొంగిపోయేవాడు కాదని , ఇపుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేది కాదని చెప్పారు. బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి పి మురళీధరరావు మాట్లాడుతూ దేశ ఐక్యత, అఖండతకు పటేల్ చేసిన సాహసోపేతమైన చర్య అందరూ గుర్తుంచుకోవాలని అన్నారు. గొప్ప రాజనీతిజ్ఞుడు, పరిపాలనాదక్షుడైన సర్దార్ పటేల్ బాటలో పయనించాలని అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/