Begin typing your search above and press return to search.

కేసీఆర్ దీక్ష ఎక్కడ చేయాలో చెప్పిన లక్ష్మణ్

By:  Tupaki Desk   |   30 Jun 2016 9:29 AM GMT
కేసీఆర్ దీక్ష ఎక్కడ చేయాలో చెప్పిన లక్ష్మణ్
X
ఆచితూచి వ్యవహరించే తెలంగాణ బీజేపీ నేతలు సైతం తెలంగాణ అధికారపక్షంపై స్పీడు పెంచినట్లుగా కనిపిస్తోంది. తమ అగ్రనాయకత్వం మీదా.. కేంద్రంలోని తమ సర్కారు మీద తెలంగాణ అధికారపక్షం అనుసరిస్తున్న వైఖరి మీద అసంతృప్తితో ఉన్న తెలంగాణ బీజేపీ నేతలు.. అప్పుడప్పుడు కేసీఆర్ అండ్ కో మీద విమర్శలు చేస్తుండటం తెలిసిందే.

హైకోర్టు విభజన అంశం మీద కేంద్రం తీరును నిరసిస్తూ.. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయాలన్న ఆలోచనలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్లుగా ప్రముఖంగా వార్తలు రావటం తెలిసిందే. దీనిపై బీజేపీ నేతలు తమదైన శైలిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఇదే అంశంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్ వెరైటీ ఐడియాను తెర మీదకు తీసుకొచ్చారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దీక్ష చేయాల్సింది ఢిల్లీలో కాదని.. అమరావతిలో అంటూ ఆయన చురకలు అంటించే ప్రయత్నం చేశారు. హైకోర్టు ఇష్యూ మీద గవర్నర్ ఇద్దరు ముఖ్యమంత్రుల్ని కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరిష్కరించుకోవాల్సిన అంశాన్ని కేంద్రాన్ని విమర్శలు చేయటం సరికాదన్నారు.

కొన్ని నెలల క్రితం చంద్రబాబునాయుడు.. కేసీఆర్ లు రెండు సార్లు కలుసుకున్నారని.. అప్పుడు హైకోర్టు విభజన అంశంపై ఎందుకు మాట్లాడుకోలేదన్న లక్ష్మణ్.. టీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ ను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తుందన్నారు. న్యాయవాదులు చేస్తున్న ఆందోళనకు తమ మద్దతు ఉంటుందన్న లక్ష్మణ్.. తెలంగాణ అధికార పార్టీపై మాత్రం వ్యంగ్య వ్యాఖ్యలు చేయటం గమనార్హం.