Begin typing your search above and press return to search.

టీడీపీతో పొత్తు డిక్లేర్ చేసిన బీజేపీ నేత...?

By:  Tupaki Desk   |   11 Nov 2021 12:30 PM GMT
టీడీపీతో పొత్తు డిక్లేర్ చేసిన బీజేపీ నేత...?
X
పొత్తులకు ఎత్తులకు ఇది సీజన్ కాదు, చూడబోతే జనరల్ ఎలెక్షన్స్ ఇంకా చాలా దూరంలో ఉన్నాయి.మరో వైపు చూస్తే రాజకీయ కాక మాత్రం ఏపీలో ఒక రేంజిలో ఉంది. అసలు 2019 ఎన్నికల తరువాత వైసీపీ సర్కార్ ఏర్పడిన నాటి నుంచి విపక్షాలు ఎక్కడా తగ్గింది లేదుగా. మొదటి రోజు నుంచే ధాటీగా రాజకీయం చేస్తూ వచ్చాయి. చూస్తూండగా ఇపుడు సగం పాలన ముగిసింది. దాంతో తొందర ఎక్కువైన కోయిలలు ముందే పొత్తు పాటలు అందుకుంటున్నాయి. ఏపీలో బీజేపీ జనసేనకు మధ్య పొత్తు ఉంది. ఆ సంగతి అందరికీ తెలుసు. మరో వైపు బీజేపీ స్నేహం కోసం టీడీపీ చేయాల్సినవన్నీ చేస్తోంది. బీజేపీకి సంబంధించి ఏపీ బాధ్యులుగా ఉన్న సునీల్ డియోధర్ కానీ, సోము వీర్రాజు కానీ టీడీపీ పొత్తు ఉండదంటే ఉండదు అనేస్తున్నారు.

ఆ సమయంలో అదే బీజేపీలో ఉన్న మరో సీనియర్ నాయకుడు దీనికి భిన్నంగా స్వరం వినిపించడం అంటే షాకింగే మరి. విశాఖకు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు టీడీపీకి తన మద్దతు అంటున్నారు. విశాఖ కార్పోరేషన్ లో 31వ వార్డుకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో టీడీపీకే కమలం అండగా ఉంటుందని తాజాగా చెప్పేశారు. చిత్రమేంటి అంటే కనీసం టీడీపీ వారి నుంచి మద్దతు కోరుతూ ఏ రకమైనా వినతి రాకుండానే రాజు గారు డేరింగ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. అది కూడా తానున్న పార్టీ పెద్దలు టీడీపీ విషయంలో తీసుకున్న స్టాండ్ కి విరుద్ధంగా ఆయన ఈ ప్రకటన చేయడమే చర్చనీయాంశం అవుతోంది.

నిజానికి విష్ణు కుమార్ రాజు గారికి చంద్రబాబు అంటే చాలా ఇష్టం. ఆయన అది ఎక్కడా ఎపుడూ దాచుకోలేదు. గత అసెంబ్లీలో ఆయన బీజేపీ తరఫున శాసనసభా పక్ష నేతగా ఉన్నారు. ఆయన అప్పుడు నిండు సభలోనే చంద్రబాబుని చాలా సార్లు పొగిడారు. చందబాబు వయసులో ఉన్నపుడు శోభన్ బాబులా అందంగా ఉండేవారంటూ కీర్తించారు కూడా. ఇక మరో విశేషం అంటి అంటే అప్పట్లో టీడెపీకి బీజేపీకి చెడిన తరువాత అసెంబ్లీలో టీడీపీ కమలం పార్టీని చీల్చిచెండాడుతున్న టైమ్ లో కూడా ఇదే రాజు గారు పెద్దగా రియాక్ట్ కాలేదన్న కామెంట్స్ ఉన్నాయి.

ఇక ఎన్నికల ముందు ఆయన టీడీపీలోకి వెళ్లాలని విపరీతంగా ట్రై చేశారన్న ప్రచారం కూడా అప్పట్లో వచ్చింది. మొత్తానికి రాజు గారు ఇపుడు కూడా టీడీపీ మీద ఏ మాత్రం మోజు చంపుకోలేదని ఆయన తాజా స్టేట్మెంట్స్ నిరూపిస్తున్నాయని అంటున్నారు. మరి ఏపీలో టీడీపీ అవినీతి పార్టీ, కుటుంబ పార్టీ అని ఒక వైపు సునీల్ డియోధర్ అంటున్నారు. ఆ పార్టీ తో తాము చేతులు కలిపే ప్రసక్తి లేదు అని ఆయన పక్కాగా చెప్పేస్తున్నారు. ఇపుడు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడి హోదాలో ఉన్న సీనియర్ నేత ఇలా టీడీపీ మీద ఇంత ప్రేమను చూపిస్తూంటే ఆయన ఏం చేస్తారు, ఏ రకమైన చర్యలు తీసుకుంటారు అన్న చర్చ అయితే గట్టిగా ఉంది. అయితే బీజేపీలో రెండు వర్గాలు ఉన్నాయని చాలా కాలంగానే ప్రచారం ఉంది. టీడీపీ అనుకూల వర్గం, వ్యతిరేక వర్గాలుగా పార్టీ ఉందని కూడా అంటారు. ఆ విధంగా చూసుకుంటే రాజు గారి స్టేట్మెంట్ ని అలాగే చూసి పక్కన పెడతారు అనే అనుకోవాలేమో.