Begin typing your search above and press return to search.

రాహుల్ గాంధీపై రూ.లక్ష రివార్డు

By:  Tupaki Desk   |   24 Jun 2016 7:08 AM GMT
రాహుల్ గాంధీపై రూ.లక్ష రివార్డు
X
విదేశీ పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ ఎక్కడున్నారో.. ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియడం లేదు. ఆయన పర్యటన వివరాలను రాహుల్ కుటుంబం - కాంగ్రెస్ పార్టీ కూడా అత్యంత గోప్యంగా ఉంచాయి. కానీ, బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉన్న రాహుల్ ఆచూకీ తెలియాల్సిన అవసరం ఉందని... ఆయన ఎక్కడున్నారో ఎవరైనా చెడితే వారికి మంచి బహుమతి ఇస్తానని మధ్యప్రదేశ్‌ కి చెందిన బిజెపి నాయకుడొకరు ప్రకటించారు. రాహుల్ కి సంబంధించిన సమాచారం ఇస్తే రూ.లక్ష రివార్డు ఇస్తానని ఆయన ప్రకటించారు.

ఇటీవలే 46వ ఏట అడుగుపెట్టిన రాహుల్ కొద్ది రోజుల పర్యటన నిమిత్తం విదేశాలకు వెళ్లారు. అయితే ఆయన ఎక్కడకు వెళ్లారు? ఏ దేశంలో ఉన్నారన్న విషయం గోప్యంగా ఉంచారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడి పర్యటనపై ప్రత్యర్థులు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మధ్యప్రదేశ్ బిజెపి అధికార ప్రతినిధి విరేంద్ర సింగ్ సిసోడియా ఒకడుగు ముందుకేసి రాహుల్ సమాచారం తెలిపితే అక్షరాల లక్షరూపాయలు రివార్డుగా ఇస్తానని ప్రకటించారు. మధ్యప్రదేశ్ ఊర్జా వికాస్ నిగమ్ చైర్మన్‌ గా ఉన్న సిసోడియా‘రాహుల్ ఏ దేశంలో ఉన్నారు? ఆయనకు సంబంధించి సమాచారం ఉంటే ఇవ్వండి. నా జేబులోంచి లక్ష రూపాయలు ఇస్తాను’ అని ప్రకటన చేశారు. రాహుల్ గత విదేశీ పర్యటనలపైనా ఆయన సెటైర్లు వేశారు.

కాగా రాహుల్ గత ఏడాది కూడా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో విదేశాల్లో సుదీర్ఘంగా గడిపారు. అప్పట్లోనూ ఆయన పర్యటనను అత్యంత రహస్యంగా ఉంచారు. అప్పట్లోనూ రాహుల్ పర్యటనపై అనేక విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ ఏడాది కూడా రాహుల్ రహస్య పర్యటనలు జరుపుతుండడంతో విపక్షాల నుంచి విమర్శలొస్తున్నాయి.