Begin typing your search above and press return to search.

గులాం నబీ ఆజాద్ సొంత పార్టీకి బీజేపీ ఫండింగ్...?

By:  Tupaki Desk   |   27 Aug 2022 6:24 AM GMT
గులాం నబీ ఆజాద్ సొంత పార్టీకి బీజేపీ ఫండింగ్...?
X
కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఇపుడు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఉన్నారు. దాదాపుగా అర్ధ శతాబ్దం రాజకీయ జీవితం ఆయనది. కాంగ్రెస్ లో పుట్టి పెరిగి ఎన్నో కీలక పదవులు నిర్వహించిన ఆజాద్ ఇపుడు సడెన్ గా కాంగ్రెస్ వద్దు అనుకున్నారు. ఇది నిజంగా రాజకీయ విచిత్రంగానే చూడాలి. గులాం నబీ ఆజాద్ సామాన్య నేత కాదు, ఇందిరా గాంధీ నుంచి రాహుల్ గాంధీ దాకా చూసిన ఈ ఏడు పదులు పై దాటిన వృద్ధ నేత మైనారిటీ వర్గాలలో మంచి పలుకుబడి కలిగిన వారు.

ప్రత్యేకించి జమ్మూ కాశ్మీర్ కి చెందిన వారు. ఇక ఆయన కాంగ్రెస్ లో అగ్ర నాయకత్వంతోనే ఎపుడూ ఉండేవారు. అలాంటి ఆజాద్ కి గత కొన్నేళ్ళుగా కాంగ్రెస్ లో సరైన ప్రాధాన్యత దక్కడంలేదని భావించి తీవ్ర అసంతృప్తి చెందారు. చివరికి అది కాస్తా ఆయన కాంగ్రెస్ ని వదిలిపెట్టేటట్లుగా చేసింది. సరే కాంగ్రెస్ ని ఆజాద్ వదిలేశారు. మరి ఆయన ఇక మీదట ఏమి చేయదలచుకుంటున్నారు అన్నది అందరిలోనూ మెదిలే ప్రశ్న.

అయితే ప్రచారంలో ఉన్న విషయం బట్టి ఆజాద్ కొత్త పార్టీ పెడతారు అని అంటున్నారు. నిజంగా ఆజాద్ ఈ వయసులో పార్టీ పెడతారా, పెట్టి నెగ్గుకురాగలరా అంటే ఆలోచించాల్సిన విషయమే. ఆజాద్ ది సుదీర్ఘ రాజకీయ జీవితమే కావచ్చు. ఆయన ఎన్నో పదవులు నిర్వహించి ఉండవచ్చు. కానీ ఆయన స్వయం ప్రకాశం ఎంతవరకూ అన్నది కూడా ఇక్కడ చర్చగా ఉంది. ఇక ఆజాద్ జమ్మూ కాశ్మీర్ కి ముఖ్యమంత్రిగా కొన్నాళ్ళు పనిచేశారు.

అది ఆయన సొంతగడ్డ. అక్కడ ఆయనకు ఎంతో కొంత ప్రాబల్యం ఉంది అని అంటున్నారు. దాంతో ఆయన చేత పార్టీ పెట్టించి జమ్మూ కాశ్మీర్ లో భారీగా రాజకీయ లబ్ది పొందాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది అని సోషల్ మీడియాలో అయితే విపరీతంగా ప్రచారం సాగుతోంది. ఎట్టి పరిస్థితులలోనూ జమ్మూ కాశ్మీర్ లో అధికారంలోకి రావాలన్నది బీజేపీ ఆలోచన. బీజేపీ రాజకీయ జీవితంలో ఫస్ట్ టైమ్ 2014 తరువాత మెహబూబా ముఫ్తీ నాయకత్వంలో పీడీఎఫ్ పార్టీతో కలసి అధికారంలోకి వచ్చింది.

అయితే సిద్ధాంత వైరుధ్యాలు ఉండడం వల్ల ఈ రెండు పార్టీలు తొందరగానే విడిపోయాయి. ఇక ఆ మీదట 2019లో బీజేపీ అధికారంలోకి రావడంతో 379 ఆర్టికల్ ని రద్దు చేసింది. ఇక గవర్నర్ పాలన అక్కడ సాగుతోంది అంటే అది ఇండైరెక్ట్ గా బీజేపీ పాలనే. అయితే లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ ఒక వైపు ఉంటే మిగిలిన పార్టీలు అన్నీ కలసి మరో వైపు నిలిచి పోటీ చేసి మెజారిటీ సీట్లు సాధించాయి.

దాంతో బీజేపీకి ఆ రాష్ట్రంలో అధికారం కష్టమన్న భావన ఉంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగితే అన్ని పార్టీలు కలసి బీజేపీని ఓడిస్తాయి. ముఖ్యంగా కాశ్మీర్ లో ముస్లిం డామినేషన్ ఉన్న ప్రాంతాలలో బీజేపీకి ఒక్క సీటు రాదు. అయితే ఇపుడు గులాం నబీ ఆజాద్ ని ముందు పెట్టి తన రాజకీయ ఆశలను నెరవేర్చుకోవాలని బీజేపీ చూస్తోంది అంటున్నారు.

ఎటూ కాంగ్రెస్ కి రాజీనామా చేసి ఒంటరిగా ఉన్న గులాం నబీ ఆజాద్ బీజేపీకి ప్రత్యేకించి మోడీకి దగ్గరివారు అన్న భావన ఉంది. దాంతో బీజేపీ భారీ ఎత్తున ఫండింగ్ ఇచ్చి ఆయన చేత పార్టీని పెట్టించడం ద్వారా కాశ్మీర్ లో పెద్ద ఎత్తున ఉన్న ముస్లిం ఓట్లను చీల్చాలని చూస్తోంది అంటున్నారు. అదే జరిగితే కచ్చితంగా బీజేపీ అధికారంలోకి రావచ్చు అని అంటున్నారు.

అందుకోసం ఆజాద్ ని వాడుకుంటారు అని సోషల్ మీడియాలో అయితే నెటిజన్లు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు ఆజాద్ కాంగ్రెస్ నుంచి వేరు పడింది బీజేపీ కోసమే అని కూడా ట్రోల్ చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ ఆజాది కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఊరకే ఉండరనే అంటున్నారు. ఆయన ఉండాలనుకున్నా బీజేపీ ఉండనీయదు అన్న విశ్లేషణలు ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.