Begin typing your search above and press return to search.

గువాహటిలో అదరగొట్టేసిన బీజేపీ అండ్ కో

By:  Tupaki Desk   |   25 April 2022 8:32 AM GMT
గువాహటిలో అదరగొట్టేసిన బీజేపీ అండ్ కో
X
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని.. ఆయన ప్రభుత్వాన్ని బద్నాం చేయటానికి.. సదరు సర్కారు చేసే తప్పుల్ని వరుస పెట్టి చూపించేందుకు తరచూ ఏదో ఒక కొత్త వివాదాన్ని తెర మీదకు తీసుకురావటం తెలిసిందే. ప్రస్తుతం బుల్ డోజర్ వివాదం బీజేపీని వెంటాడుతోంది.

తమ ప్రత్యర్థుల ఇళ్లను బుల్ డోజర్లను పెట్టి మరీ కూల్చేస్తుందన్న విష ప్రచారం సాగుతుంటే.. అందుకు భిన్నంగా నేరమయ జీవితాలు.. క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ తో పాటు.. దారుణ నేరాలతో సంబంధం ఉన్న వారి నివాసాల్ని.. అక్రమంగా ఆక్రమించుకున్న వారి ఇళ్లను బుల్ డోజర్లు పెట్టి కూల్చేస్తున్న వేళ.. దానికి భిన్నంగా సాగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు.

ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న బీజేపీకి.. కొత్త శక్తిని ఇచ్చేలా గువాహటి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 60 వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు తాజాగా వెలువడ్డాయి. ఇందులో 58 వార్డుల్ని బీజేపీ.. దాని మిత్రపక్షమైన ఏజీపీ తిరుగులేని విజాన్ని సొంతం చేసుకున్నాయి.

మిగిలిన రెండు స్థానాల విషయానికి వస్తే.. అందులో ఒకటి ఆమ్ ఆద్మీ పార్టీ సొంతం చేసుకుంటే.. ఇంకొకటి అసోం జాతీయ పరిషత్ విజయం సాధించింది. రాష్ట్రంలో రెండో అతి పెద్ద ప్రతిపక్ష పార్టీగా చెప్పే కాంగ్రెస్ ఒక్క సీటును కూడా గెలుచుకోకపోవటం గమనార్హం.

మొత్తం 60 వార్డుల్లో 53 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తే వారిలో ఏకంగా 52 మంది విజయాన్ని సొంతం చేసుకున్నారు. మిగిలిన ఏడు వార్డుల్లో బీజేపీ మిత్రుడు ఏజేపీ అభ్యర్థులు పోటీ చేస్తే ఆరుగురు విజయం సాధించారు. దీంతో మొత్తంగా 58 స్థానాల్లో కమలనాథులు వారి మిత్రుడు గెలుపు జెండా ఎగురవేశారు.

జీఎంసీ ఎన్నికల్లో బీజేపీ.. దాని మిత్రపక్షానికి చారిత్రక విజయాన్ని కట్టబెట్టినందుకు ప్రజలకు శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నట్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత్ బిస్వాస్ పేర్కొన్నారు. ఏమైనా తాజా విజయం కమలనాథులకు కొత్త శక్తిని ఇవ్వటం ఖాయమని చెప్పకతప్పదు.