Begin typing your search above and press return to search.

రేవంత్ ఎంట్రీతో బీజేపీ అలెర్ట్.. ‘బండి’ స్పీడ్ పెంచిందా?

By:  Tupaki Desk   |   5 July 2021 4:53 AM GMT
రేవంత్ ఎంట్రీతో బీజేపీ అలెర్ట్.. ‘బండి’ స్పీడ్ పెంచిందా?
X
తెలంగాణలో రెండు సార్లు అధికారంలో ఉన్న కేసీఆర్ మూడో సారి అధికారంలోకి రావడం.. హ్యాట్రిక్ కొట్టడం దాదాపు అసాధ్యమే. ఎందుకంటే ప్రజలు మార్పు కోరుకుంటారు. రెండు సార్లు పాలించిన వ్యతిరేకత తీవ్రంగా ఉంటుంది. దాన్ని అధిగమించి కేసీఆర్ నిలబడుతాడా? పడిపోతాడా? ఆ వ్యతిరేకతను ప్రతిపక్షాలు క్యాష్ చేసుకొని కేసీఆర్ ను దించేస్తారా? అన్నది కీలకం.

అయితే ఆ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడానికే ప్రతిపక్ష కాంగ్రెస్.. యువకుడు, ఉత్సాహవంతుడు కేసీఆర్ అంటేనే విరుచుకుపడే రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ ను చేసింది. రేవంత్ రెడ్డి తన టార్గెట్ కేసీఆర్, టీఆర్ఎస్ అని ప్రకటించాడు. ఆయనను గద్దెదించడమే ధ్యేయమన్నాడు. తొలుత నిరుద్యోగ అంశాన్ని టేకప్ చేశాడు. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టగానే తెలంగాణ అంతటా పాదయాత్రకు రంగం సిద్ధం చేస్తున్నాడు. దూకుడుకు మారుపేరైన రేవంత్ రెడ్డి ఎంట్రీతో తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కాయి.కేసీఆర్ సైతం ఇప్పుడు ఉద్యోగాల మీద పడ్డాడు. పోలీస్ సహా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వేస్తున్నారు.

రేవంత్ రెడ్డి మంచి ఫైర్ బ్రాండ్.. యూత్ లో ఆయనపై మంచి క్రేజ్ ఉంది. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ ఇచ్చాక.. కాంగ్రెస్ స్పీడు పెరుగుతోంది. అందుకే బీజేపీ సైతం ఇన్నాళ్లు తమకు ఎదురు లేదని.. కేసీఆర్ ను ఓడించి తెలంగాణలో 2023లో అధికారం సాధిస్తామని నమ్మకంగా ఉంది. కానీ రేవంత్ రాకతో ఇప్పుడు త్రిముఖ పోరు అనివార్యమైంది. రేవంత్ రెడ్డి ఎంట్రీతోనే బీజేపీ, బండి సంజయ్ కంగారు పడుతున్నట్టుగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తోంది.

బండి సంజయ్ కి.. బీజేపీకి.. తెలంగాణ రాష్ట్రమంతటా క్యాడర్, నాయకుల బలం లేదు. అదే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉంది. రేవంత్ రెడ్డికి యూత్ సపోర్టు ఉంది. తెలంగాణ కాంగ్రెస్ తో పోలిస్తే బీజేపీ బలం రాష్ట్రంలో తక్కువే. కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ నియోజకవర్గ ఇన్ చార్జులు కూడా బలంగా లేరు. పోటీ చేయడానికి సరిపడా బలం లేదు.

కాంగ్రెస్ లోని కుమ్ములాటల వల్ల మొన్న బీజేపీ తెలంగాణలో కొంచెం సీట్లు సంపాదించి హైలెట్ అయ్యింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ కు యువ రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టాక మార్పు కనిపిస్తోంది. సీనియర్లను కలుస్తూ అసమ్మతిని తగ్గిస్తూ అందరినీ కలుపుకుపోవడానికి రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. రేవంత్ రెడ్డి వచ్చాక కాంగ్రెస్ లో ఐక్యత, క్యాడర్ లో నైరాశ్యంపోయి బలోపేతమైంది. దీంతో బీజేపీ మూడో స్థానంలోకి వెళ్లాల్సిందేనని విశ్లేషకులు అంటున్నారు.

సో రేవంత్ ఎంట్రీతోనే బీజేపీ అధిష్టానం అలెర్ట్ అయ్యి హైదరాబాద్ నుంచి హుజూరాబాద్ వరకు ‘బండి సంజయ్’తో పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతోంది. నిజానికి పాదయాత్ర కాన్సెప్ట్ రేవంత్ రెడ్డిది. ఆయన ముందే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రకు ప్లాన్ చేశాడు. దాంతో వైబ్రేషన్స్ వస్తాయని గమనించి బండి సంజయ్ తో బీజేపీ ముందస్తుగానే దాన్ని కాపీ కొట్టించి పాదయాత్ర చేస్తోంది. అంటే రేవంత్ రెడ్డి భయం బీజేపీకి పట్టుకుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.