Begin typing your search above and press return to search.

బీజేపీకి 400 సీట్లు... ఓవర్ కాన్ఫిడెన్స్ కా బాప్ .?

By:  Tupaki Desk   |   7 Sep 2022 4:30 PM GMT
బీజేపీకి 400 సీట్లు... ఓవర్ కాన్ఫిడెన్స్ కా బాప్ .?
X
వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ లేని ప్రభుత్వం వస్తుందని విపక్షాలు ఒక వైపు ధీమాగా చెబుతున్నాయి. దాని కోసం చేయాల్సిన ప్రయత్నాలు ఎవరి మాటుకు వారు చేస్తున్నారు. బీజేపీని ఎలాగైనా గద్దె దించాలని ప్రతిపక్ష కూటమి ధ్యేయంగా ఉంది. ఇక బీజేపీ విషయం తీసుకున్నా కూడా ఇంటర్నల్ డిస్కషన్ లో గతంలో వచ్చినన్ని సీట్లు వస్తాయా అన్నదే కలతగా ఉంది అంటారు.

2019 ఎన్నిలలో మూడు వందల సీట్లకు పైగా బీజేపీ సాధించింది. బీజేపీ అదే ఎన్నికల్లో 37 శాతం పైగా ఓట్ల షేర్ ని రాబట్టుకుంది. 1989 తరువాత ఒక పార్టీకి ఇంత పెద్ద ఎత్తున ఓట్ల షేర్ ఎపుడూ రాలేదు. ఇలా అప్రతిహత విజయాలను బీజేపీ సొంతం చేసుకుంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే వచ్చే ఎన్నికల కోసం కమలం ఆపరేషన్ స్టార్ట్ చేసింది. బీజేపీ మేధ మధనం కూడా సాగిస్తోంది.

ఆ వివరాలను బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తాజాగా మీడియాకు చెబుతూ వచ్చే ఎన్నిలల్లో బీజేపీ టార్గెట్ 400 సీట్లు అని బోల్డ్ గా చెప్పేశారు. ఈసారొ 400 సీట్లను పక్కాగా తాము సాధిస్తామని ఆయన అంటున్నారు. అంతే కాదు ఏపీలో వైసీపీకి ధీటైన పోటీ తమ పార్టీ ఇస్తుందని చెప్పుకున్నారు. చిత్రమేంటి అంటే టీడీపీని జనాలు ఎవరూ లెక్కచేయడం లేదు అనడం.

ఒక విధంగా జీవీఎల్ చెబుతున్న విషయాలు చూస్తే ఆ పార్టీకి దేశంలోనూ ఏపీలో కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందనే అర్ధమవుతోంది. 2019 ఎన్నికలో జీరో పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు తెచ్చుకున్న బీజేపీ 2024లో ఎలా అధికారంలోకి వస్తుందో ఆయనే చెప్పాలని అంటున్నారు. ఇక జనసేన‌తో పొత్తు ఉందని, ఆ పార్టీని కలుపుకుని తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జీవీఎల్ చెబుతున్నారు. తమకు టీడీపీతో పొత్తే లేదని అంటున్నారు.

ఇక దేశంలో 400 సీట్లు అంటే బీజేపీ కాంగ్రెస్ రికార్డ్ ని బద్ధలు కొట్టాలని చూస్తోందిలా ఉంది. 1984లో రాజీవ్ గాంధీ నాయకత్వాన కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్తే 400కి పైగా ఎంపీ సీట్లు వచ్చాయి. ఆ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ఇందిరా గాంధీ ప్రధాని హోదాలో తన ఇంట్లోనే దారుణ హత్యకు గురి అయ్యారు. ఆ సానుభూతి వెల్లువలా రావడం వల్ల అది సాధ్యపడింది. అంతకు ముందు నెహ్రూ, ఇందిరలకు కూడా అలాంటి రేర్ ఫీట్ సాధ్యపడలేదు.

మరి బీజేపీ విషయానికి వస్తే సొంతంగా రెండు సార్లు అధికారంలోకి రావడమే గొప్ప రికార్డు. ఈ రెండు సార్లు కూడా కాంగ్రెస్ కుదేల్ కావడం, విపక్షాలు ఐక్యంగా లేకపోవడం వల్ల బీజేపీ గట్టిగా నిలబడింది. అదే టైం లో మోడీ మీద ఉన్న మోజు కూడా ఆ పార్టీని ఒడ్డెక్కించాయి. ఇపుడు అంతటా బీజేపీ వ్యతిరేకత కూడగట్టుకుని ఉంది. కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికలను తేలికగా తీసుకొవడంలేదు. రాహుల్ గాంధీ పాదయాత్రకు రెడీ అయ్యారు. విపక్షాలు కూడా వాస్తవాలు గుర్తించి ఈసారి కలసి వస్తాయని కూటమి కడతాయని అంతా అంటున్నారు.

ఒక విధంగా చెప్పాలీ అంటే యూపీఏ త్రీకి అంతా సిద్ధం అవుతోంది. ఈ నేపధ్యంలో 400 సీట్లు బీజేపీకి వస్తాయి అంటే ఏ విధంగా అని భావించాలో బీజేపీ పెద్దలే చెప్పాలి. అలాగే బీజేపీ వరస వైఫల్యాలు జానాలు మరచిపోయి అధిక ధరలను కూడా ఆనందంగా భరించి మరీ ఓట్లేస్తారు అనుకుంటే మాత్రం కమలం పార్టీ అత్యాశ పడుతున్నట్లే అంటున్నారు. నిజానికి ఈసారి తమకు సీట్లు దారుణంగా తగ్గిపోతాయని బీజేపీ లోలోపల బెంగ పడుతోంది. మరి 400 సీట్లు ఎక్కడ నుంచి వస్తాయో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.