Begin typing your search above and press return to search.

బిహార్‌వాసి సంచ‌ల‌నం: ఆస్తిలో స‌గం భార్య‌కు, మిగ‌తాది ఏనుగుల‌కు పంప‌కం

By:  Tupaki Desk   |   11 Jun 2020 2:30 AM GMT
బిహార్‌వాసి సంచ‌ల‌నం: ఆస్తిలో స‌గం భార్య‌కు, మిగ‌తాది ఏనుగుల‌కు పంప‌కం
X
కేరళలో గర్భంతో ఉన్న ఏనుగు మరణవార్తతో అంద‌రి హృద‌యాల‌ను క‌రిగించిన విష‌యం తెలిసిందే. మాన‌వుల్లో అంద‌రూ చెడ్డ‌వారు కాదు.. మంచివాళ్లు కూడా ఉన్నార‌ని చాలామంది నిరూపిస్తున్నారు. ఇప్పుడు ఒక వ్య‌క్తి ఏనుగుల పాలిట దేవుడిగా నిలుస్తున్నాడు. ఏనుగుల‌ను త‌న సంతానంగా భావించి ఏకంగా వాటికి ఆస్తి పంప‌కం చేసిన వ్య‌క్తి బిహార్ రాష్ట్రంలో ఉన్నాడు. అత‌డే బిహార్‌కు చెందిన ఏసియన్‌ ఎలిఫెంట్‌ రిహాబిలిటేషన్‌ అండ్‌ వైల్డ్ లైఫ్‌ యానిమల్‌ ట్రస్ట్ (ఏఈఆర్‌ఏడబ్ల్యూఏటీ) చీఫ్‌ మేనేజర్‌ ఇమాం అక్తర్. ఏనుగులకు త‌న ఆస్తిలో రూ.5 కోట్ల విలువైన ఆస్తిని రాసి ఇవ్వ‌గా మిగ‌తా సగ భాగం త‌న భార్య పేరున రాసి సంచ‌ల‌నం సృష్టించాడు. ఈ క్ర‌మంలో అక్తర్‌ ఇమామ్ ఈ మేర‌కు వీలునామా రాశాడు.

12 ఏళ్ల వయసు నుంచి ఇమామ్ మోతీ, రాణీ అనే ఏనుగుల సంరక్షణ చూసుకుంటున్నాడు. చిన్నప్పటి నుంచి ఆ ఏనుగులంటే ఇమామ్‌కు ఎంతో ప్రాణం. వాటిని సొంత బిడ్డ‌లుగా చూసుకుంటున్నాడు. స్నానం చేయించ‌డం, ఆహారం అందించ‌డం వంటివి రోజు చేస్తుంటాడు. మోతీ, రాణీలు ఏనుగులే కాదు అవి రెండూ మా కుటుంబసభ్యులు అంటాడు. ఓ రోజు దుండగుల తుపాకీ దాడి మోతీ, రాణీలు గాయపడ్డాయని వాటిని చూసిన నాకు ఎంతో బాధ వేసిందని ఇమామ్ తెలిపాడు. అప్పటి నుంచి వాటిని త‌న‌ ప్రాణంగా చూసుకుంటున్నాడు.

తనకుండే భూమిని ఏనుగుల పేరిట రాయ‌డంతో ఇమామ్‌పై తన కుటుంబసభ్యులు వాగ్వాదం ప‌డ్డారు. దీంతో వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ అత‌డి భార్య, కొడుకు అత‌డిని వదిలివెళ్లిపోయారు. కుటుంబ తగాదాలతో భార్యకుమారుడు తనకు దూరంగా ఉంటున్నా..వారంటే నాకు చాలా ఇష్టమ‌ని, వారితో పాటు మోతీ, రాణిలు కూడా ఇష్టమ‌ని ఇమామ్ చెబుతున్నాడు. కుటుంబ‌స‌భ్యుల కోసం మోతీ, రాణీలకు మాత్రం ఎప్పటికీ వదులుకోలేనని ఇమామ్ స్ప‌ష్టం చేస్తున్నాడు. ఈ విష‌యంలో తనపై ఓ తప్పుడు కేసు బానాయించి తనను జైలుకు పంపించారని వాపోయాడు. ఈ విష‌యంలో త‌నపై కోపంతో తన కుమారుడు స్మగ్లర్లతో చేతులు కలిపి మోతీ, రాణిలను ఏనుగును విక్ర‌యించేందుకు ప్రయత్నించడంతో త‌న‌కు చాలా కోపం వచ్చిందని తెలిపాడు.

తనతో పాటు మోతీ, రాణీలకు కూడా తన కుటుంబసభ్యులనుంచి ప్రాణాహాని ఉందని గ్ర‌హించి అందుకే తనకున్న మొత్తం ఆస్తిలో సగం భార్యకు, మిగతా సగం ఏనుగుల పేరు మీద వీలునామా రాసిన‌ట్లు ఇమామ్ ప్ర‌క‌టించాడు. ఏనుగులు పేరు మీద రాసిన ఆ ఆస్తి ఆ ఏనుగులు మరణిస్తే ఈఆర్‌ఏడబ్ల్యూఏటీ ట్రస్టుకు చెందేలా వీలునామా రాశారు. ఇంత‌టి గొప్ప వ్య‌క్తిని చూసి జంతు ప్రేమికులు, ప్ర‌జ‌లు అభినందిస్తున్నారు. మాన‌వ‌త్వం చాటుతున్న ఇమామ్‌కు స‌లామ్ చేస్తున్నారు.