Begin typing your search above and press return to search.

మందు తాగేవారు మ‌హాపాపులు.. బీహార్ సీఎం సంచ‌లన వ్యాఖ్య‌లు!

By:  Tupaki Desk   |   31 March 2022 1:30 PM GMT
మందు తాగేవారు మ‌హాపాపులు.. బీహార్ సీఎం సంచ‌లన వ్యాఖ్య‌లు!
X
బీహార్ సీఎం నితీశ్ కుమార్ అంటే.. వివాదాల‌కు ఆమ‌డ దూరం అనే పేరు తెచ్చుకున్నారు. నిబ‌ద్ధ‌త క‌లిగిన పాల‌న‌కు కూడా ఆయ‌న పెట్టిందిపేరు. అయితే.. ఆయ‌న కూడా ఇటీవ‌ల కాలంలో వివాదాల‌కు.. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు కేంద్రంగా మారిపోయారు. తాజాగా బిహార్‌లో మ‌ద్య నిషేధం అంశంపై.. కొన్ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న బిహార్ అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల్లో.. సీఎం నితీష్ కుమార్ ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రాష్ట్రంలో మ‌ద్య నిషేధం సంపూర్ణంగా అమ‌లు అవుతోంద‌న్నారు.

త‌న ప్ర‌భుత్వంపై ప్ర‌తిప‌క్షాలు కావాల‌నే విమ‌ర్శ‌లు చేస్తున్నాయ‌ని చెప్పిన నితీష్ కుమార్‌.. 'మద్యం తాగేవారు అంతా మహా పాపులు..వారు అసలు భారతీయులే కాదు' అంటూ వ్యాఖ్యానించారు. మద్యం తాగేవారికి బాధ్యతలేదని..అలా మద్యం తాగేవారి గురించి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవాలని ఆయ‌న ప్ర‌శ్నించారు. కల్తీ మద్యం, సారాయి తాగడం వల్ల మృతి చెందే వారి కుటుంబాల విష‌యంలో ప్ర‌భుత్వం ఎందుకు బాధ్య‌త తీసుకోవాల‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. వారి కుటుంబాలకు ఎటువంటి సహాయం అందజేయదని నితీశ్ తేల్చిచెప్పారు..

``మద్యం తాగేవారు గాంధీ ఆదర్శాలను పట్టించుకోరు. అటువంటివారి గురించి ఎందుకు పట్టించుకోవా లి?. గాంధీజీ మద్యం సేవించడాన్ని వ్యతిరేకించారు. ఆయన సిద్ధాంతాలను పట్టించుకోకుండా మందు తాగుతున్నవారు ముమ్మాటికీ మహా పాపులే. అలా మద్యం తాగేవాళ్లను నేను భారతీయులుగా గుర్తించను`` అని అసెంబ్లీ సాక్షిగా ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు.. బీహార్ లో మద్య నిషేధం అమ‌లుసంపూర్ణంగా జ‌రుగుతోంద‌న్నారు.

మందు తాగడం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా చాలా మంది దాన్ని తాగుతున్నారు.. దీని వల్ల జరిగే పర్యవసానాలకు వారే బాధ్యులని సీఎం నితీశ్ చెప్పారు. మందు విషంతో సమానమని తెలిసినా తాగుతున్నారు అంటూ తీవ్రంగా మందుబాబులపై మండిపడ్డారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మ‌ద్య పాన నిషేధంపై ప్ర‌భుత్వం చేసిన స‌ర్వే తాలూకు వివ‌రాల‌ను స‌భ‌కు వివ‌రించారు. బీహార్‌లో ప్రభుత్వం నిర్వహించిన సర్వే ప్రకారం 2018 నాటికి 1 కోటి 74 లక్షల మంది మద్యం సేవించడం మానేశారని సీఎం తెలిపారు. మద్యపానం ద్వారా వచ్చే ఆదాయంపై ఆధార పడిన రాష్ట్రాలే.. మ‌ద్యాన్ని నిషేధించ‌డం లేద‌ని వ్యాఖ్యానించారు.

అయితే... రాష్ట్రంలో మద్య నిషేధాన్ని అమలు చేయడంలో నితీశ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని విప‌క్షాలు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డాయి. ఆర్జేడీ నేత‌లు.. వివ‌రాలతో స‌భ‌ను కుదిపేశారు. దీంతో సీఎంకు.. ఆర్జేడ స‌భ్యుల‌కు మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో వాగ్యుద్ధం చోటు చేసుకుంది. దీంతో స‌భ‌ను స్పీక‌ర్ వాయిదా వేశారు.