Begin typing your search above and press return to search.

పీకే ఎవ‌రు? బీహార్ ముఖ్య‌నేత సంచ‌ల‌న ప్ర‌శ్న‌

By:  Tupaki Desk   |   9 May 2022 9:30 AM GMT
పీకే ఎవ‌రు?  బీహార్ ముఖ్య‌నేత సంచ‌ల‌న ప్ర‌శ్న‌
X
ప్రశాంత్‌ కిశోర్ ... దేశ‌వ్యాప్తంగా పాపులారిటీ క‌లిగి ఉన్న ఎన్నికల వ్యూహకర్త . వివిధ రాజ‌కీయ పార్టీల‌కు వ్యూహ‌క‌ర్త‌గా సేవ‌లు అందించి వాటిని విజ‌య‌తీరాల‌కు చేర్చారు, ఆ పార్టీ ర‌థ‌సార‌థుల‌ను సీఎంను చేశాడు.

అలాంటి పీకే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు స‌ర్వం సిద్ధ‌మైన ద‌శ‌లో... ఆఖ‌రు నిమిషంలో చేరిక నిలిచిపోయింది. త‌న సొంత రాష్ట్రమైన బీహార్‌ను బ‌లోపేతం చేసేందుకు అంకితం కానున్న‌ట్లు వెల్ల‌డించిన ప్ర‌శాంత్ కిశోర్‌..అక్టోబ‌ర్ 2వ తేదీ నుంచి మూడు వేల కిలోమీట‌ర్ల పాద‌యాత్ర చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపారు.

బీహార్‌లో సమస్యలు, పరిష్కారాలపై ఈ పాద‌యాత్ర‌లో అవ‌గ‌తం చేసుకుంటాన‌ని పీకే వ్యాఖ్యానించారు. అయితే, ఇలా వ్యూహ‌త్మ‌కంగా ముందుకు సాగుతున్న పీకేకు ఊహించ‌ని షాక్ ఎదురైంది. బీహార్‌కు చెందిన ఓ యువ‌నేత అస‌లు పీకే ఎవ‌రు? అంటూ ప్ర‌శ్నించారు.

గడిచిన 30 ఏళ్ల‌లో బీహార్‌లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ప్రశాంత్‌ కిశోర్‌ చేసిన వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించ‌గా 'ప్రశాంత్‌ కిశోర్‌ ఎవరు?'.. అని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ ప్రశ్నించారు. ప్రశాంత్‌ కిశోర్ చేసిన ఆ ఆరోపణలు నిరాధారమైనవని ఆర్జేడీ యువ‌నేత పేర్కొన్నారు.

బీహార్‌లో జ‌రిగిన అభివృద్ధి గురించి పాద‌యాత్ర స‌మ‌యంలో ప్ర‌శాంత్ కిశోర్‌కు తెలుస్తుంద‌ని చెప్పుకొచ్చారు. పాద‌యాత్ర రూపంలో ప్ర‌జ‌ల‌తో క‌ల‌వాల‌ని అనుకున్న పీకే నిర్ణ‌యం మంచిదేన‌ని తేజ‌స్వి యాద‌వ్ వ్యాఖ్యానించారు.

కాగా, ఇటీవ‌ల ప్ర‌శాంత్ కిశోర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన సంగ‌తి తెలిసిందే. బీహార్‌లో అభివృద్ధి జ‌ర‌గ‌లేద‌ని పేర్కొన్న ప్ర‌శాంత్ కిశోర్‌...రాష్ట్రంలోని ప‌రిస్థితుల‌పై తాను 18వేల మందితో మాట్లాడినట్టు చెప్పారు. 'జన్‌ సురాజ్‌' పేరుతో ఓ వేదికను ఏర్పాటు చేస్తానని, అభివృద్ధిని కోరుకొనేవాళ్లు ఈ వేదికపై కలిసి పనిచేయవచ్చని పేర్కొన్నారు.

ఇది భవిష్యత్తులో రాజకీయ పార్టీగా రూపుదిద్దుకొనే అవకాశాలు లేకపోలేదని తెలిపారు. 'రాజకీయ పార్టీని ప్రారంభించాలనుకొంటే ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు కూడా చేయవచ్చు. నాలుగేళ్ల‌ దాకా బీహార్‌లో ఎన్నికలు లేవు. ఇప్పుడు నేను ప్రజలను నేరుగా కలుస్తాను' అని వ్యాఖ్యానించారు. ఇందుకోసం అక్టోబర్‌ 2న చంపారన్‌లోని గాంధీ ఆశ్రమం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానని వెల్లడించారు. యాత్ర ఏడాది పాటు 3వేల కిలోమీటర్లు సాగుతుందని తెలిపారు.