Begin typing your search above and press return to search.

ఏంటి ‘పెగాసస్’ ఫోన్ ట్యాపింగ్.. ఎలా చేస్తారు?

By:  Tupaki Desk   |   19 July 2021 5:17 AM GMT
ఏంటి ‘పెగాసస్’ ఫోన్ ట్యాపింగ్.. ఎలా చేస్తారు?
X
దేశాన్ని కుదిపేసే సంచలన నిజం బయటపడింది. విదేశీ మీడియా సంచలన కథనాలను ప్రచురించింది. భారత దేశంలో భారీ ఫోన్ ట్యాపింగ్ ఉదంతాన్ని బయటపెట్టాయి. దేశంలోని కీలక నేతలు, జర్నలిస్టులు.. ఆఖరుకు సుప్రీంకోర్టు జడ్జీల ఫోన్లు కూడా హ్యాకింగ్ అయ్యాయని సంచలన కథనాలు కలకలం రేపుతున్నాయి.ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ తన కేబినెట్ లోని పలువురు మంత్రులు, విపక్ష నాయకులు, సుప్రీంకోర్టు జడ్జీలు, ఆర్ఎస్ఎస్ నేతలు, జర్నలిస్టులు, ముఖ్య అధికారులు, దౌత్య అధికారుల ఫోన్లు ట్యాప్ చేసినట్టుల విదేశీ మీడియా వాషింగ్టన్ పోస్ట్, గార్డియన్ లు సంచలన కథనాలు ప్రచురించాయి. 2019 ఎన్నికల సమయంలోనే ‘ఇంజ్రాయెల్ దేశానికి చెందిన స్పైవేర్ ‘పెగాసస్’ ద్వారా ఈ ఫోన్లు ట్యాప్ చేశారని’ రాసుకొచ్చాయి. దీంతో దేశంలో పెనుదుమారం రేగింది. మరోసారి కేంద్రాన్ని షేక్ చేసే పరిణామంగా ఇది పరిణమించింది.

దీనిపై స్వయంగా బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్ చేశారు. ‘దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ‘వాషింగ్టన్ పోస్ట్, లండన్ కు చెందిన గార్డియన్ పత్రికలు’ ఓ ఆసక్తికర విషయాన్ని ప్రచురించాయని.. పెగాసస్ ద్వారా దేశంలో ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేశారని తెలిసిందని.. వాస్తవాలు నిర్ధారించుకున్న తర్వాతే ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయో జాబితా వెల్లడిస్తానని సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్ చేశారు.

ప్రముఖ పత్రిక ఇండియన్ ఎక్స్ ప్రెస్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ‘దాదాపు రెండు డజన్ల సంస్థలు, లాయర్లు, దళిత ఉద్యమకారులు, జర్నలిస్టుల ఫోన్లను పెగాసస్ ట్యాప్ చేసింది’ అని పేర్కొంది. వాట్సాప్ సంస్థ తొలుత ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1400 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు వివరించింది. అయితే అప్పటి కేంద్ర సమాచార, ప్రసారాలశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేశారు.

-ఏంటి ‘పెగాసస్’ ఫోన్ ట్యాపింగ్.. ఎలా చేస్తారు?

ఇజ్రాయెల్ కు చెందిన ఎస్ఎస్ఓ అనే సంస్థ తయారు చేసిన స్పైవేర్ టూల్ ‘పెగాసస్’. వ్యక్తుల మీద నిఘా పెట్టడమే ఈ పెగాసస్ ముఖ్య ఉద్దేశం. దీనికోసం ఫోన్లు ఉన్న వినియోగదారులకు ఒక లింక్ వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే చాలు ఆ యూజర్ ఫోన్ పూర్తిగా ఎవరైతే హ్యాక్ చేస్తున్నారో వారి స్వాధీనంలోకి వెళ్లిపోతుంది. యూజర్ కు తెలియకుండానే ఆ టూల్ అతడి ఫోన్ లో ఇన్ స్టాల్ అవుతుంది. ఒక సారి ఇన్ స్టాల్ అయ్యాక ఫోన్ కు సంబంధించిన డేటానంతా ఎటాకర్ కు పంపించడం మొదలుపెడుతుంది. వ్యక్తిగత డేటాతోపాటు పాస్ వర్డ్స్, కాంటాక్ట్ లిస్ట్, క్యాలెండర్ ఈవెంట్స్, ఈమెయిల్స్ తోపాటు లైవ్ వాయిస్ కాల్స్ ను కూడా ఇది ట్రాక్ చేస్తుంది.ఆఖరికి యూజర్ కు తెలియకుండా అతడి ఫోన్ కెమెరాను, మైక్రోఫోన్ ను కూడా ఆన్ చేసి విని, చూడగలిగే సామత్యం హ్యాకర్ కు ఉంటుంది. ఇప్పుడు ఒక మిస్డ్ వీడియో కాల్ చేసి కూడా ఫోన్ ను ఈ కొత్త ‘పెగాసస్’ సాఫ్ట్ వేర్ హ్యాక్ చేస్తోందని ‘వాట్సాప్’ ఆరోపించింది.

ఈ క్రమంలోనే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మే నెల మధ్యలో దాదాపు 20 దేశాల్లో దాదాపు 1400 మందికి పైగా పెగాసస్ ద్వారా హ్యాక్ చేశారని వాట్సాప్ సంచలన ఆరోపణలు చేసినట్టు విదేశీ మీడియా తెలిపింది. ఇప్పటికే పెగాసస్ పై వాట్సాప్ సంస్థ శాన్ ఫ్రాన్సిస్కో కోర్టులో దావా కూడా వేసింది.

ఇప్పుడు ఇదే ఇజ్రాయలీ పెగాసస్ సంస్థ భారత్ లో నిఘాకు వినియోగించారన్న వార్తలు బయటకు రావడంతో పెను సంచలనమైంది. దీన్ని కేంద్రం చేసిందా? లేక దీనివెనుక ఎవరున్నారన్నది నిగ్గుతేలాల్సిన అవసరం ఉంది. ఇంత పెద్ద స్థాయిలో ఇంతపెద్ద ప్రముఖులపై 2019 సార్వత్రిక ఎన్నికల వేళ సాగిన ఈ తంతు ఇప్పుడు దేశాన్ని కుదిపేయడం ఖాయంగా కనిపిస్తోంది.