Begin typing your search above and press return to search.

సచివాలయ ఉద్యోగులకు బిగ్ షాక్‌ ... బయోమెట్రిక్‌ తప్పనిసరి , తేడా వస్తే ..!

By:  Tupaki Desk   |   21 Oct 2021 11:30 AM GMT
సచివాలయ ఉద్యోగులకు బిగ్ షాక్‌ ... బయోమెట్రిక్‌ తప్పనిసరి , తేడా వస్తే ..!
X
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చివాలయ ఉద్యోగులకు జగన్ సర్కార్ పలు కీలక సూచనలు చేసింది. ప్రభుత్వ ఉద్యోగులందరికీ బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి రేవు. ముత్యాల రాజు బయోమెట్రిక్ అటెండెన్సును తప్పనిసరి చేస్తూ గురువారం మెమో జారీ చేశారు. కోవిడ్-19 ఉధృతి అనంతరం తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపత్యంలో బయోమెట్రిక్ అటెండెన్స్‌ను తప్పనిసరి చేసినట్లు ప్రభుత్వం మెమోలో వెల్లడించింది.

ఉద్యోగులందరికీ ఐదు రోజుల పనిదినాల విధానాన్ని 2022 జూన్ వరకూ పొడిగించిన నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ విధుల్లో ఉండాలంటూ ప్రభుత్వం స్పష్టం చేసింది. సోమవారం నుంచి శుక్రవారం వరకూ ప్రతిరోజూ ఉద్యోగుల హాజరును పరిశీలించాల్సిందిగా ఆయా శాఖల కార్యదర్శులకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఉదయం 10 గంటల 10 నిముషాల అనంతరం విధులకు వస్తే ఆలస్యంగా హాజరైనట్టు పరిగణిస్తామని ప్రభుత్వం పేర్కొంది. సచివాలయ మాన్యువల్ ప్రకారం నెలలో మూడు సార్లు మాత్రమే ఆలస్యంగా హాజరును అనుమతిస్తామని, ఆ తర్వాత వేతనాల్లో కోత ఉంటుందని ప్రభుత్వం స్పష్టంచేసింది.

దీంతోపాటు ఉదయం 10 గంటల నుంచి 5.30 గంటల వరకూ విధుల్లో ఉంటేనే పూర్తి హాజరుగా పరిగణిస్తామని సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. స్పందనపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో తనిఖీలు బాగా మెరుగుపడ్డాయని సీఎం చెప్పారు. తనిఖీలకు వెళ్లినప్పుడు రిజిస్టర్‌ పరిశీలన తప్పనిసరి అని సూచించారు. తనిఖీలకు వెళ్లినప్పుడు గతంలో దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించామా లేదా చూడాలన్నారు. రిజిస్టర్‌లో పేర్కొన్న అంశాలను సచివాలయాల విభాగాధిపతికి పంపించాలన్నారు. అలాగే ఏదైనా పరిష్కరించాల్సిన కొత్త అంశాన్ని గుర్తిస్తే.. వాటిని కూడా రిజస్టర్‌లో నమోదు చేయాలన్నారు.

గ్రామ, వార్డు సచివాలయాలను తనిఖీ చేసినప్పుడు గుర్తించిన అంశాలు, సమస్యలను పరిష్కరిస్తున్నారా, లేదా వాటిపై దృష్టిపెడుతున్నారా,లేదా అన్నదానిపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. దీనికి సంబంధించిన ప్రోటోకాల్‌ను తయారు చేయాలన్నారు. ఆ ప్రోటోకాల్‌ను పాటిస్తున్నారా లేదా కచ్చితంగా చూడాలన్నారు. దాదాపు 80శాతం సచివాలయాల ఉద్యోగులు మంచి పనితీరు కనపరుస్తున్నారని తనిఖీల ద్వారా వెల్లడైందన్నారు. మిగిలిన 20 శాతం మంది సచివాలయాల సిబ్బంది కూడా వారి పనితీరును మెరుగుపరుచుకునేలా మనం వారికి తోడ్పాటును అందించాలని సూచించారు. నూటికి నూరు శాతం గ్రామ, వార్డు సచివాలయాలు మంచి పనితీరును చూపించేలా సిబ్బందికి తగిన చేయూతను, తోడ్పాటును అందించాలని సీఎం ఆదేశించారు.

వాలంటీర్ల సేవలపైనా కూడా దృష్టిపెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వారు మెరుగైన సేవలు అందించేలా వారికి కౌన్సెలింగ్‌ చేయాలన్నారు. వారు అప్‌గ్రేడ్‌ అయ్యేలా చూడాలని.. అందుకు వారికి చేయూతనిచ్చి.. తీర్చిదిద్దాలని సూచించారు. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు.. బృందాలుగా ఏర్పడి వారి పరిధిలోని ప్రతి కుటుంబాన్ని కలవాలన్నారు. గతంలో జరిగిన అవుట్‌రీచ్‌ కార్యక్రమంలో కొన్నిచోట్ల కేవలం వాలంటీర్లు మాత్రమే కలిసినట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. కచ్చితంగా సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్ల బృందాలుగా ఏర్పడి… కుటుంబాలను కచ్చితంగా కలవాలని సూచించారు. నెలలో ప్రతి బుధవారం గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో కచ్చితంగా సమావేశాలు జరగాలన్నారు. ఇందులో సిబ్బంది, వాలంటీర్లు ఈ సమావేశాల్లో పాల్గొనాలని సూచించారు.