Begin typing your search above and press return to search.

మహేంద్ర సింగ్ ధోనికి బిగ్ షాక్

By:  Tupaki Desk   |   7 April 2022 10:21 AM GMT
మహేంద్ర సింగ్ ధోనికి బిగ్ షాక్
X
ఐపీఎల్ జోరందుకుంది. ఈ సీజన్ లో చెన్నై పగ్గాలు వదలుకొని రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ ఇచ్చి కేవలం ఆటగాడిగానే ధోని కొనసాగుతున్నారు. అయితే జడేజా కెప్టెన్సీ ప్రయోగం వికటించింది. చెన్నై సూపర్ కింగ్స్ వరుస ఓటములతో సతమతమవుతోంది. ఇప్పటికే హాట్రిక్ పరాజయాలు చవిచూసింది.

జట్టుతోపాటు పనిలో పనిగా ధోని ప్రదర్శన మీద విమర్శలు వెల్లులెత్తాయి. టీమిండియా లెజెండరీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ సైతం ధోనిపై ఆరోపణలుచేశారు. పంజాబ్ తో మ్యాచ్ లో ధోని క్రీజులో ఉండి గెలిపించలేకపోయాడని.. నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో దూకుడుగా ఆడిన శివం దుబేతో స్ట్రైక్ రొటేట్ చేయకుండా నిర్లక్ష్యం చేశాడని మండిపడ్డారు.

ఇక ధోనికి తాజాగా మరో షాక్ తగిలింది. ధోని సరికొత్త రూపంలో నటించిన ఐపీఎల్ ప్రోమోపై భారీ విమర్శలు వెల్లువెత్తాయి. కన్స్యూమర్ ఫోరమ్స్  ఈ ప్రోమోపై ఫిర్యాదులు సైతం చేసింది. ఫలితంగా ఈ ప్రోమోను ఉపసంహరించుకోవాలని ఐపీఎల్ గవర్నింగ్ బాడీ నిర్ణయం తీసుకుంది. దీనికి ముహూర్తం కూడా పెట్టింది. ఈనెల 20వ తేదీ నుంచి ఈ ప్రోమో ఇక ఎక్కడా కనిపించకపోవచ్చని అంటున్నారు. దాన్ని టెలికాస్ట్ చేయడాన్ని నిలిపివేయనున్నారు.

ఈ లేటెస్ట్ ప్రోమోలో ధోని 'బస్ డ్రైవర్'గా కనిపించాడు. బస్సును డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్న ధోని.. ఓ షోరూం ఎదురుగా సడన్ బ్రేక్ వేసి ఆపేస్తాడు. షోరూమ్ లో అమ్మకానికి ఉంచిన టీవీల్లో ఐపీఎల్ మ్యాచ్ నడుస్తుండగా.. దాన్ని చూస్తూ బస్సు ఢోర్ వద్ద కూర్చుండిపోతాడు. బస్సులో ఉన్న ప్రయాణికులందరినీ చూడాలని సూచిస్తాడు.  బస్సును రోడ్డు మధ్యలో ఆపేయడంతో దానివెనుక వస్తోన్న వాహనాలన్నీ నిలిచిపోతాయి. ట్రాఫిక్ జామ్ అవుతుంది.

ఈ క్రమంలోనే ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చి ధోనిని ఇలా బస్ ఎందుకు ఆపావంటే 'సూపర్ ఓవర్ నడుస్తోంది' అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిస్తాడు. దీనికి ఆ పోలీస్ కానిస్టేబుల్ ఓఖే తలైవా.. అంటూ నవ్వుతూ వెళ్లిపోతాడు.

ఐపీఎల్ 2022 సీజన్ ను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ప్రోమో ఇది. కొంతకాలంగా ఇది టెలికాస్ట్ అవుతోంది. ఇప్పుడు ఈ ప్రోమో విమర్శలకు కేంద్రబిందువైంది. ఈ ప్రోమో ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా చిత్రీకరించారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేలా వాహనాదారులకు సూచిస్తోందంటూ వినియోగదారుల ఫోరం అభ్యంతరం వ్యక్తం చేశారు.  దీనిపై యాస్కీ సంస్థ స్పందించి ప్రోమోను నిలిపివేయాలంటూ ఐపీఎల్ ను ఆదేశించింది.